క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్పై జైట్లీ వివరణ: ట్విట్లర్లో వీడియో పోస్ట్
ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డిజి ధన్మేళా కార్యక్రమ సందర్భంలో జైట్లీ అన్నారు. నేరుగా కాదు కదా పరోక్షంగా అర్థమొచ్చేలా కూడా ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. దీర్ఘకాల మూలధన లాభాలపై
ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత మదుపర్లలో నెలకొన్న భయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలగించారు. అదే విధంగా డిజీధన్ మేళా, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ వద్ద పలు ఆర్థిక విషయాలపై మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియోలను ట్విట్లర్లో పోస్ట్ చేశారు. దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను విధించే యోచనలో ప్రభుత్వం లేదని జైట్లీ స్పష్టం చేశారు. దీర్ఘకాల మూలధన లాభాల మీద పన్ను విధిస్తామనే రీతిలో ప్రధాని వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం జరుగుతోందని జైట్లీ వివరించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డిజి ధన్మేళా కార్యక్రమ సందర్భంలో జైట్లీ అన్నారు. నేరుగా కాదు కదా పరోక్షంగా అర్థమొచ్చేలా కూడా ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను విధిస్తారనే అభిప్రాయానికి ఎవరూ రాకూడదనే తాను ఇంత వివరంగా స్పష్టత ఇస్తున్నానని పేర్కొన్నారు.
డిజిధన్ మేళాలో జైట్లీ మాట్లాడిన విషయాలకు సంబంధించిన వీడియో
షేర్లను కొనుగోలు చేసి, ఏడాది వరకు అట్టేపెట్టుకొని ఆ తర్వాత లాభానికి విక్రయిస్తే.. ఆ వచ్చిన లాభంపై ప్రస్తుతం పన్ను చెల్లించనక్కర్లేదు. అదే ఏడాది లోపు లాభానికి విక్రయిస్తే లాభంపై 15% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఎవరైతే స్టాక్ మార్కెట్ల ద్వారా లాభాలను ఆర్జిస్తున్నారో, వారు పన్నుల ద్వారా దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని శనివారం ప్రధాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ల పన్ను రేట్లలో పారదర్శకంగా, సముచితరీతిలో మార్పులు తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన అన్నారు.