నోట్ల రద్దు నేపథ్యంలో రుణ చెల్లింపులకు అదనపు గడువు
నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు సంక్షోభం నేపథ్యంలో.. వాహన, ఇంటి రుణాలు, పంట రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువునిస్
నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు సంక్షోభం నేపథ్యంలో.. వాహన, ఇంటి రుణాలు, పంట రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువునిస్తున్నట్లు పేర్కొంది. అయితే, రూ.కోటి లోపు రుణాలు తీసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు. అది కూడా నవంబరు 1 నుంచి డిసెంబరు 31 దాకా చెల్లించాల్సిన వాటికి వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.
వ్యాపారం కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న కాలపరిమితి రుణాలు, తాకట్టు రుణాలు ఇతరత్రా.. రూ.కోటి అంతకన్నా తక్కువ లోన్లు.. బ్యాంకుల నుంచి తీసుకున్నవి, బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి, సూక్ష్మరుణ సంస్థల నుంచి తీసుకున్న వాటన్నింటికీ ఈ వెసులుబాటు లభిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పలు బ్యాంకింగ్ వర్గాలు స్వాగతించాయి. ''నోట్ల రద్దు నిర్ణయం వల్ల చాలా మంది ఖాతాదారులు సమయానికి చెల్లింపులు జరపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగింది'' అని డీహెచ్ఎఫ్ఎల్ సీఈవో హర్షిల్ మెహతా అన్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోపు ఈఎంఐలు కట్టాల్సినవారు నగదు సంక్షోభం కారణంగా ఆ సొమ్మును చెల్లించలేకపోయినప్పటికీ.. వారి క్రెడిట్ స్కోరు దెబ్బతినదని వివరించారు. కాగా.. ఓవర్డ్రాఫ్ట్/క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగినవారికి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.50 వేలకు పెంచుతూ మరో నిర్ణయాన్ని కూడా ఆర్బీఐ తీసుకుంది. ఇంతకుముందు ఈ అవకాశాన్ని కరెంటు ఖతాలున్నవారికి మాత్రమే వర్తింపజేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజా వెసులుబాటు వ్యక్తిగత ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలున్నవారికి వర్తించదు.