కార్పొరేట్ అప్పు రూ. 5 లక్షల కోట్లకు పైనే
దేశంలోని ప్రముఖ కార్పొరేట్ గ్రూపు సంస్థలకు ఉన్న అప్పు రూ.5.73 లక్షల కోట్లు. ఈ మేరకు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ వెల్లడించారు. బ్యాంకులు, ఇతరత్రా రుణ సంస్థలకు 10 దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సిన విషయం నిజమేనా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. రూ. 5 కోట్లకు పైగా బకాయిలు ఉన్న కంపెనీల సమాచారాన్ని ఆర్బీఐ సేకరిస్తుందని ఆయన సభకు తెలిపారు. రుణ సమాచార వెల్లడి నిషేధమైనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐకు మినహాయింపు ఉందని గంగ్వార్ అన్నారు. మొండి బకాయిలు అధికంగా ఉంటోన్న మౌలిక, ఉక్కు, జౌళి లాంటి రంగాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రైట్ఆఫ్లు (రద్దు) రూ.59,547 కోట్లని మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ.12,017 కోట్లు, విదేశీ బ్యాంకుల్లో రూ.1,057 కోట్లు చొప్పున రైటాఫ్లు నమోదయ్యాయని ఆయన అన్నారు. రైటాఫ్ అంటే వాటిని రద్దు చేశారని అర్థం.
ఎన్పీఏలకు మందగమనమూ కారణమే...
మొండి బకాయిల సమస్య పెరగడానికి ఆర్థిక వ్యవస్థలోని మందగమన పరిస్థితులు కొంత వరకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎన్పీఏలు అధికంగా ఉన్న మౌలిక, ఉక్కు, జౌళి వంటి రంగాల పునరుత్తేజానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారానికి కసరత్తు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికతో ఉందని తెలిపారు.
బ్యాంకు నిరర్దక రుణాల వసూలు
బ్యాంకింగ్ రంగంలో క్రమంగా పెరుగుతున్న నిరర్దక ఆస్తుల(ఎన్పీఏ)లపై ఆయన స్పందించారు. బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎగవేస్తున్న, బకాయిలు నిర్ణీత కాలంలో చెల్లించని వాటి వసూలు ప్రక్రియకు కొత్తగా ఆరు డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందన్నారు. చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైతే... రుణ హామీదారుపై చర్యలకు బ్యాంకులకు సూచించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ ఖాతాదార్లకు సంబంధించి రైటాఫ్ వివరాలు తమ వద్ద లేవని ఆర్బీఐ తెలిపిందని మంత్రి వెల్లడించారు.
భారీగా రుణాల రద్దు
మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో రుణాల రద్దు గురించి వివరించారు. 2015-16లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 59,547 కోట్ల రుణాలను మాఫీ(రద్దు) చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రయివేటు రంగ విషయంలో ఈ మొత్తం రూ.12వేల కోట్లుగా ఉందన్నారు. విదేశీ బ్యాంకుల విషయంలో ఈ పరిమాణం రూ. 1057 కోట్లుగా ఉంది.
కేవీఐసీ... బలహీన రుణ రికవరీ వ్యవస్థ: కాగ్
ఇదిలా ఉండగా, కేవీఐసీ(ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) రుణ రికవరీ వ్యవస్థ పాటించే ప్రక్రియ అత్యంత బలహీనంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో వెల్లడించింది. ఈ రూపంలో రాబట్టుకోవాల్సిన మొత్తం రూ. 551 కోట్లకు పైగా ఉందని తెలిపింది.
సమస్యల్లో ఉక్కు రంగం
మరో పక్క ఉక్కు రంగం తీవ్ర సమస్యల్లో ఉంది. ఆ రంగానికి సంబంధించిన మొత్తం అప్పులు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. నిరర్దక ఆస్తుల్లో ఎక్కువ శాతం ఈ రంగానివే కావడం విశేషం. దీనిపై లోక్సభలో స్పందించిన ఉక్కుమంత్రి వివరణ ఇచ్చారు. ఉక్కు రంగాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయంగా ఉత్పత్తి ఎక్కువ ఉన్న మూలంగా మన ఉక్కు పరిశ్రమ సైతం సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. చాలా ఉక్కు ఉత్పత్తి దేశాలు మన దేశంలో తక్కువ ధరలకే మన దేశంలో తమ ఉత్పత్తులను అమ్ముతున్నాయని అన్నారు.
ఈ మొండి బకాయిలపై కార్యాచరణ
గత నెలలో పార్లమెంటుకు తెలిపిన సమాధానంలో మొండి బకాయిలపై ప్రభుత్వ చర్యలను మంత్రి సమర్థించుకున్నారు. నిరర్ధక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చాలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యుత్, ఉక్కు, జౌళి రంగంలో సమస్యలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇందుకోసం కొత్త రుణ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, ఉమ్మడి రుణ దాతల ఫోరం, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి చేపడుతున్నట్లుగా వివరించారు.