క్రిస్మస్ ఆఫర్: రూ.603కే విమాన టికెట్
ముంబై: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. క్రిస్మస్ సేల్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ టికెట్ ధరను రూ. 603గా నిర్ణయించింది.
మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా టికెట్ బుక్ చేసుకున్న ప్రతి 25 మందిలో ఒకరు ఉచితంగా టికెట్ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంలో ఎల్లప్పుడూ ముందుండే గో ఎయిర్ గత నెలలో కూడా రూ. 691కే టికెట్ను అందిస్తున్నట్టు ప్రకటించింది.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పలు విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ. 1,158గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్ ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో దేశీయంగా 6.60 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.