రిటైల్ రంగంలో మెగా మెర్జర్: ఫ్యూచర్, భారతి విలీనం
దేశంలోని రెండు అతిపెద్ద రిటైల్ వ్యాపార సంస్థలు ఒక్కటి కాబోతున్నాయి. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎంటర్ప్రైజెస్ తమ రిటైల్ వ్యాపారాలను విలీనం చేసేందుకు నిర్ణయించాయి. సోమవారం జరిగిన మీటింగ్లో ఫ్యూచర్ గ్రూపు బోర్డు ఆమోదం తెలిపింది.
రెండు వ్యాపార సంస్ధల మధ్య జరిగిన వ్యాపార ఒప్పంద ప్రకారం ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ వ్యాపారాన్ని విడదీసి భారతి రిటైల్లో విలీనం చేస్తుంది. అదేవిధంగా భారతి రిటైల్కు చెందిన రిటైల్ ఇన్ఫ్రా వ్యాపారాన్ని ఫ్యూచర్ రిటైల్లో విలీనం చేయనుంది. ఈ డీల్ రెండు విడుతలుగా జరుగనుంది.
విలీనాంతరం ఏర్పడే రెండు కంపెనీల్లో భారతి రిటైల్ ప్రమోటర్లకు 15 శాతం, ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు 46- 47 శాతం వాటాలు ఉంటాయి. ఫ్యూచర్ రిటైల్ షేర్ హోల్డర్లకు ప్రతి 2 రూపాయల ముఖ విలువ గల ఒక్కో షేరుకు.. భారతి రిటైల్ ఒక్కో ఈక్విటీ షేరు (2 రూపాయల ముఖ విలువ) జారీ చేస్తుంది.
రిటైల్ ఇన్ఫ్రా వ్యాపార విలీనానికి సంబంధించి, భారతి రిటైల్ షేర్హోల్డర్ల వద్ద ఉన్న రెండు రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు అంతే ముఖ విలువ ఉన్న ఒక ఈక్విటీ షేరును ఫ్యూచర్ రిటైల్ జారీ చేస్తుంది. విలీన ఒప్పందం ప్రకారం భారతి రిటైల్కు ముందుగా 500 కోట్ల రూపాయల విలువైన షేర్లు లభిస్తాయి.
తర్వాత కాలంలో మరో 250 కోట్ల రూపాయల విలువైన షేర్లను డిబెంచర్ల కన్వర్షన్ ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతం భారతీ రిటైల్పై రుణభారం లేదు. కానీ విలీన రిటైల్ సంస్థపై రూ.1200 కోట్లు, రిటైల్ ఇన్ఫ్రా కంపెనీపై రూ.3,500 కోట్ల రుణ భారం పడనుంది. 6-8 నెలల్లో విలీనం పూర్తవుతుందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.
విలీన అనంతరం విశేషాలు:
* ప్రస్తుతం భారతీ రిటైల్ దేశంలో ఈజీ డే బ్రాండ్నేమ్తో 210 విక్రయ కేంద్రాలున్నాయి.
* ఇక ఫ్యూచర్ గ్రూపు 2012లోనే బ్రాండెడ్ వస్త్ర వ్యాపారాల రిటైల్ విక్రయ సంస్థ పాంటలూన్స్ను ఆదిత్య బిర్లా రిటైల్కు విక్రయించింది.
* ప్రస్తుతం బిగ్ బజార్ బ్రాండ్నేమ్తో హైపర్ మార్కెట్లను, ఫుడ్ బజార్ పేరుతో సూపర్ మార్కెట్లను నిర్వహిస్తుంది.
* విలీనాంతర రిటైల్ సంస్థకు దేశ్యాప్తంగా 243 పట్ణణాల్లో 570 స్టోర్స్ ఉంటాయి.
* ఇందులో 203 బిగ్ బజార్, ఈజీ డే హైపర్ మార్కెట్స్, 197 ఫుడ్బజార్, ఈజీ డే సూపర్ మార్కెట్లు ఉంటాయి.
* హోమ్టౌన్, ఈ జోన్, ఫుడ్ హాల్, ఎఫ్బిబి వగైరా స్టోర్స్ మరో 171 వరకు ఉండనున్నాయి.