‘జిప్ డయల్’ను సొంతం చేసుకున్న ట్విట్టర్
న్యూయార్క్/న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ సంస్థ ‘జిప్ డయల్'ను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలు చేసింది. దాదాపు 30 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జిప్ డయల్ తన వెబ్సైట్, ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది.
ట్విట్టర్ ఇండియా కూడా తన ఖాతాలో ఈ ఒప్పందం గురించి ట్వీట్ చేసింది. దేశ వ్యాప్తంగా ప్రజలతో మరింత అందుబాటులో ఉండేందుకు జిప్ డయల్ను సొంతం చేసుకున్నామని ట్విట్టర్ పేర్కొంది.
బెంగళూరుకు చెందిన జిప్ డయల్ మార్కెటింగ్ ప్రచారం కోసం తమ క్లయింట్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లను సేకరిస్తుంది. దీంతో వినియోగదారులు కొన్ని నెంబర్లకు కాల్ చేయగా, కనెక్ట్ అయ్యే ముందు కాల్ హ్యాంగ్ అవుతుంది. అంటే మిస్డ్ కాల్ వస్తే సరిపోతుంది.
తర్వాత వారికి కావాల్సిన సమాచారానికి సంబంధించిన సమాధానం ప్రమోషన్ రూపంలో ఉన్న టెక్స్ట్ మెసేజ్ ద్వారా వెళ్తుంది. జిప్ డయల్ క్లైంట్లలో యునీలీవర్, డిస్నీ, జిల్లెట్, అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.