ఉద్యోగ నామ సంవత్సరం: 10లక్షల ఉద్యోగాలు, 40శాతం గ్రోత్
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం దేశంలోని యువతకు భారీగానే ఉద్యోగాలను అందించేందుకు సిద్ధమైంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు 2015లో 10 లక్షల వరకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని, సిబ్బందికి గరిష్ఠంగా 40 శాతం వరకు వేతనం పెంచే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జీతాల పెంపు సరాసరిగా 15-20 శాతం మధ్యలో ఉండవచ్చని వారి అంచనా.
నిరుడు అన్ని రంగాల్లోనూ కలిపి పెంపు 10-12 శాతం మధ్యలో నమోదైంది. ఈ-కామర్స్ వంటి కొత్త రంగాల్లో ఈ ఏడాది వేతనాల పెంపు భారీ స్థాయిలో ఉండవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 5.5 శాతానికి చేరుకోనున్న నేపథ్యంలో సంస్థల వ్యాపారాలు కూడా పుంజుకోనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగావకాశాలు సైతం పెరుగనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ సంస్థలు అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టవచ్చని మానవ వనరులు సమకూర్చే సంస్థలు చెబుతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ ఏడాది భారత్లో తమ వ్యాపారాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు, ఫలితంగా ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ పోస్టులతో ఇతర కేటగిరీల్లోనూ భారీగా ఉద్యోగావకాశాలు లభించవచ్చని వారు పేర్కొన్నారు.
నూతన సంవత్సరం అన్ని రంగాల్లో కలిపి కొత్తగా 9.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించవచ్చని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ అంచనా వేసింది. ఇందులో ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు జాబ్ మార్కెట్ను ముందుండి నడిపించవచ్చని తెలిపింది. గడిచిన మూడేండ్లతో పోలిస్తే కొత్త సంవత్సరం ఫ్రెషర్లకు ఈ-కామర్స్, బ్యాంకింగ్, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్ సెక్టార్లలో అధిక అవకాశాలు లభించవచ్చని మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ సిఈఓ రాజేష్ కుమార్ తెలిపారు.