ఎట్టకేలకు: ఎంసిఎక్స్ ప్రమోటర్ జిగ్నేశ్ షా అరెస్ట్
ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో జిగ్నేశ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగం ఇక్కడ పిటిఐకి తెలిపింది. వేలాది మదుపర్లు ఎన్ఎస్ఇఎల్ కుంభకోణంలో కోట్లాది రూపాయలను నష్టపోవడంతో ఎన్ఎస్ఇఎల్ ప్రధాన ప్రమోటర్గా వ్యవహరిస్తున్న ఎఫ్టిఈఎల్కు నేతృత్వం వహిస్తున్న జిగ్నేశ్ షాపై గత సంవత్సరమే దర్యాప్తులు మొదలయ్యాయి. 2001 జనవరి నుంచి ఎఫ్టిఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న జిగ్నేశ్ షా.. ఇప్పుడు ఎఫ్టిఐఎల్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణా అధికారిగా ఉన్నారు.
ఇదిలావుంటే తాజాగా షా అరెస్టుతో ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో అరెస్టయినవారి సంఖ్య ఏడుకు చేరింది. గత ఏడాది అక్టోబర్లో తొలుత సంస్థ సిఈఓ అంజని సిన్హా అరెస్టవగా, ఇప్పుడు సిన్హా జైల్లో ఉన్నారు. 13,000 మంది మదుపర్లకు 5,600 కోట్ల రూపాయలను చెల్లించడంలో ఎన్ఎస్ఈఎల్ విఫలమవగా, ఈ కుంభకోణంలో ఎఫ్టిఐఎల్, జిగ్నేశ్లు అధికంగా లబ్ది పొందారని గతంలో ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్ఎమ్సి) వ్యాఖ్యానించిన విషయం విధితమే.
ఈ క్రమంలోనే దేశంలో ఏ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్వహణకూ ఎఫ్టిఐఎల్, జిగ్నేశ్లకు అర్హత లేదని ఎఫ్ఎమ్సి పేర్కొనగా.. ఎంసిఎక్స్లో ఎఫ్టిఐఎల్కు ఉన్న 26 శాతం వాటాను 2 శాతానికి తగ్గించుకోవాలని కూడా ఆదేశించింది. దీనిపై ఎఫ్టిఐఎల్, జిగ్నేశ్లు కోర్టులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు స్టాక్మార్కెట్ రెగ్యులేటర్ సెబి సైతం ఎఫ్ఎమ్సి ఆదేశాన్ని సమర్థించడంతో ప్రస్తుతం ఎంసిఎక్స్లోని వాటాను తగ్గించుకునే పనిలోనే ఎఫ్టిఐఎల్ నిమగ్నమైంది. అయనప్పటికీ ఎఫ్ఎమ్సి, సెబి ఆదేశాన్ని సవాల్ చేస్తూ సెక్యురిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఎఫ్టిఐఎల్ ఆశ్రయంచింది.
నేడు ఎఫ్టిఐఎల్ బోర్డు సమావేశం
జిగ్నేశ్ షా అరెస్ట్ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చర్చించేందుకుగాను గురువారం ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా బోర్డు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నట్టు ఎఫ్టిఐఎల్ డైరెక్టర్, ఎంసిఎక్స్ మాజీ ఛైర్మన్ వెంకట్ చారి తెలిపారు.
రూ.126 కోట్ల ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశం
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఇఎల్) కుంభకోణంలో అతిపెద్ద ఎగవేతదారు సంస్థల్లో ఒకటిగా ఉన్న మోహన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని అధికారులకు చెందిన 126 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక యాంటీ మనీలాండరింగ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో కంపెనీ, అధికారులకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు చేయనున్నారు.
ఎంసిఎక్స్, ఎఫ్టిఐఎల్పై సెబి దర్యాప్తు
ఎంసిఎక్స్, ఎఫ్టిఐఎల్ లిస్టింగ్ ఒప్పందాల ఉల్లంఘనకున్న అవకాశాలపై స్టాక్మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విచారణ జరుపుతోంది. పిడబ్ల్యుసి ఆడిటింగ్ నివేదిక నేపథ్యంలో సెబీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.