అనిశ్చితి తొలగాలి, ఐటిని విస్తరించాలి: నాస్కామ్
జాతీయ జిడిపితో పోల్చితే ఐటి రంగం మంచి వృద్ధినే సాధించిందన్నారు.
2014-15 ఆర్థిక సంవత్సరంలో 13 నుంచి 15 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. మరి కొద్ది రోజుల్లో ముగియనున్న వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 12 నుంచి 14 శాతం మధ్య ఉండవచ్చునని తెలిపారు. ఐటి రంగానికి ప్రధాన ఎగుమతి గమ్యాలైన అమెరికా, బ్రిటన్లలో ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో కూడా ఈ వృద్ధి ప్రోత్సాహనీయమైనదేనని అన్నారు. ఐటి రంగం ముందు పెను సమస్యలున్నట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖర్ చెప్పారు.
ప్రధానంగా అంతర్జాతీయ అస్థిరతలు ఐటి రంగం వృద్ధికి అవరోధంగా నిలిచాయంటూ సాంప్రదాయికంగా 80 శాతం ఐటి ఎగుమతులకు అమెరికా, బ్రిటన్లే గమ్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇందుకు భిన్నంగా ఈజిప్టు, జపాన్, చైనా వంటి కొత్త మార్కెట్లలో గల అవకాశాలపై దృష్టి పెట్టడం అవసరమని చంద్రశేఖర్ తెలిపారు. వాస్తవానికి అన్ని దేశాలకు ఒకే వ్యూహం పనికిరాదని, దేశం మౌలిక స్వభావాన్ని బట్టి వ్యూహాలు రూపొందించుకుంటూ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవన పథంలో పడడం కూడా భారత ఐటి రంగానికి సానుకూలమైన పరిణామమని చంద్రశేఖర్ తెలిపారు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలల్లోనూ ఐటి ఎదగాలి
పెద్ద నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి రంగం విస్తరణకు వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా ఐటి పరిశ్రమలు (ఎస్ఎంఇ) కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ప్రోత్సాహం, రాయితీలు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. నాస్కామ్ ఇప్పటికే ఇలాంటి కొన్ని అంశాలతో అన్ని రాజకీయ పార్టీలకు సూచనలతో కూడిన నివేదికలు పంపిందని, కొన్ని పార్టీలు ఈ అంశాలను పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో కూడా పొందుపర్చాయని ఆయన వివరించారు.
ఎన్నికల అనంతరం ఐటి రంగాన్ని ఉద్దీపితం చేయగల చర్యలు కొత్త ప్రభుత్వం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎంఇలకు ప్రోత్సాహం అంటే పన్ను మినహాయింపులు కాదని ఆయన తేల్చి చెప్పారు. అసలు ఆదాయమే లేకుండా పన్నులు ఎక్కడ నుంచి కడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతు లేకుండా చిన్న నగరాల్లో పరిశ్రమ విస్తరించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఎస్ఎంఇలకు చిన్న నగరాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించడం, రెగ్యులేటరీపరమైన అవరోధాలన్నీ సడలించడం, మార్కెట్ అవకాశాలు పెంచడం అవసరమని చంద్రశేఖర్ అన్నారు.
రానున్న కాలంలో ఐటి రంగాన్ని ముందుకు నడిపేది స్మాక్ విభాగమని చంద్రశేఖర్ అన్నారు. సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్లనే స్మాక్గా వ్యవహరిస్తారని తెలిపారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడమే స్మాక్ విస్తరణకు కారణమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది సంవత్సరాలుగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తొలగిపోవడంతో రానున్న రోజుల్లో ఐటి రంగం అభివృద్ధి బాటలో నడిచే అవకాశం ఉందని తెలిపారు.