చిరంజీవి చొరవ: తిరుపతిలో పాకశాస్త్ర వర్సిటీ
చిరంజీవి చొరవతో ఎన్నో రోజులుగా చెబుతున్న పాకశాస్త్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ వర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయిలో వివిధ వంటకాల గురించి శాస్త్రీయ బోధన లభిస్తుంది. కోల్కతా, ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో వర్సిటీ శాఖలుంటాయి.
ఆతిథ్య రంగంలో దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిన రీత్యా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీ సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని అధికార వర్గాలు చెప్పాయి. ఇంకా వర్సిటీలో మాస్టర్స్ కోర్సులను, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. కాగా చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారతీయ పాక శాస్త్ర యూనివర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేశారు.
12వ పంచవర్ష ప్రణాళికలో పర్యాటకరంగ వర్కింగ్ గ్రూప్ నివేదికలో ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ (పాకశాస్త్ర యూనివర్సిటీ)ను ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేయాలని చిరంజీవి సూచించారు. కాగా, ఇప్పటికే తిరుపతిలో వర్సిటీ కోసం 14 ఎకరాల భూమిని పర్యాటక శాఖ కేటాయించింది. మరో 20 నెలల్లో తిరుపతిలో ఈ వర్సిటీ పనులు పూర్తి కానున్నాయి. 2016 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.