75 శాతం టికెట్ ధరలను తగ్గించిన స్పైస్జెట్
ముంబై: విమానయాన ప్రయాణీకుల కోసం స్పైస్జెట్ మరో కొత్త ఆఫర్ను ముందుకు తెచ్చింది. ‘సూపర్ సమ్మర్ సేల్' పేరిట తీసుకొస్తున్న ఈ ఆఫర్లో భాగంగా విమాన టికెట్ ధరలను ఏకంగా 75 శాతం వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బుధవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వాస్తవ ధరల కంటే 75 శాతం తక్కువ ధరలకే స్పైస్జెట్ విమానాల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది.
వేసవికాలం మొదలవుతుండటంతో హాలీడే టూర్లకు వెళ్లేవారికి ఈ పథకం ఎంతగానో పయోగపడుతుందని స్పైస్జెట్ పేర్కొంది. కాగా, గడిచిన నెల రోజుల్లో ఇలాంటి పథకాలను స్పైస్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. ఇంతకు ముందు ప్రకటించిన రెండు ఆఫర్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించడంతోనే మూడో ఆఫర్కు శ్రీకారం చుట్టినట్టు కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఆఫర్ల ద్వారా తరచూ ప్రయాణాలు చేసే వారే కాకుండా కొత్తగా విమాన ప్రయాణం చేయాలనుకునే వారు చవకగా టికెట్లను సొంతం చేసుకోవచ్చని స్పైస్ జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజివ్ కపూర్ తెలిపారు.
ఇలాంటి అడ్వాన్స్ కొనుగోలు ఆఫర్ల మూలంగా కస్టమర్లకు, సంస్థకు, పరిశ్రమకు ఉభయతారకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆఫర్ లేకుండా మిగిలి ఉన్న సీట్లతో ఖాళీగా విమానాలను నడపాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎయిర్లైన్స్ కంపెనీల మధ్య ఆఫర్ల పోరుకు తాము ప్రయత్నం చేయడం లేదని, ఇన్వెంటరీ, రెవెన్యూ మేనేజ్మెంట్లో భాగంగానే ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు.
కాగా ఇంతకు ముందు రెండుసార్లు ఆఫర్లు ప్రకటించినప్పుడు ఇతర కంపెనీలు కూడా పోటీగా ఆఫర్లను ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా స్పైస్జెట్ బాటలోనే ఇతర చౌక విమానయాన కంపెనీలైన ఇండిగో, గోఎయిర్లు ఆఫర్లను ప్రకటించాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు బుకింగ్ చేసుకునే టికెట్లపై 70 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్టు గోఎయిర్ ప్రకటించింది. కొన్ని టికెట్లపై ఇండిగో డిస్కౌంట్లను ప్రకటించింది. వచ్చే హాలీడే సీజన్లో ఉండే అవకాశాలను ముందుగానే సొంతం చేసుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లకు మళ్లీ తెరతీశాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
గోవా, కేరళ వంటి గమ్యస్థానాలకు ఇప్పటికే గిరాకీ బాగా ఉందని, తాజాగా ఆఫర్లు ప్రకటించడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ పోర్టల్ యాత్రా డాట్ కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ పేర్కొన్నారు. కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో బుకింగ్ రెండింతలకు పైగా పెరిగాయని ఆయన చెప్పారు. కళానిధి మారన్ సారథ్యంలోని స్పైస్ జెట్ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి 172 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. దీన్ని తగ్గించుకోవడానికే పలుమార్లు ఆఫర్లకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది.