ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో భారతీయుల జోరు
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన సత్య నాదెళ్ల ప్రపంచ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈఓగా రెండు రోజుల క్రితం ఎంపికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా సత్య నాదెళ్ల ప్రమోటర్ కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్కు సిఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకేకాక ఇంకా చాలా మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు అంతర్జాతీయ యవనికపై బహుళజాతి సంస్థలకు అధిపతులుగా కొనసాగుతూ భారత ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు.
ఇప్పటికే ఇంద్రనూయి, లక్ష్మీమిట్టల్, అన్షుజైన్, ఇవాన్ మెనెంజీస్ లాంటి భారతీయ సంతతికి చెందిన వారు విదేశాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 13 మంది భారతీయ సంతతికి చెందిన వారు ప్రపంచ టాప్ కంపెనీల్లో అత్యున్నత సిఈఓ పదవుల్లో కొనసాగుతుండటం భారతదేశానికి గర్వకారణంగానే చెప్పుకోవచ్చు. అలాంటి కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, పెప్సికో, ఆర్సిలర్ మిట్టల్, డాయిచీ బ్యాంక్, డియాగో, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలున్నాయి.
కాగా ఈ 13 మందిలో నలుగురు భారతీయులు ఢిల్లీలోని సెయింట్ స్టెఫెన్స్ కాలేజిలో చదువుకున్న వారు కావడం విశేషం. ఇవాన్ మెనెజస్, అజయ్ బంగా, పియూష్ గుప్తా, వసుదేవలు సెయింట్ స్టెఫెన్స్ కాలేజిలోనే విద్యనభ్యసించారు. ఇంతకుముందు సిటీ గ్రూప్, వోడాఫోన్, మోటరోలా కంపెనీల సిఈఓలు సైతం భారతీయ సంతతికి చెందిన వారే ఉండటం గమనార్హం.
టాప్-10 కంపెనీ సిఇఒల్లో భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల (మైక్రోసాఫ్ట్), ఇంద్రానూయీ (పెప్సీ), లక్ష్మీ మిట్టల్ (ఆర్సెలార్ మిట్టల్), అన్షు జైన్ (డ్యూషే బ్యాంక్), ఇవాన్ మెనెంజిస్ (డియాజియో), రాకేష్ కపూర్ (రిక్కిట్ బెన్స్కిసర్), అజయ్ బంగా (మాస్టర్ కార్డ్), పియూష్ గుప్తా (డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్), సంజయ్ మెహ్రోత్రా (సాన్ డిస్క్), సంజయ్ ఝా (గ్లోబల్ ఫౌడ్రిస్), శంతను నారాయణ్ (అడోబ్) ఉన్నారు. ఇంకా రాజీవ్ వసుదేవ (ఎగోన్ జెండర్), అజిత్ జైన్ (హథ్వే), దినేష్ పాలీవాల్ (హర్మాన్ ఇంటర్నేషనల్) అధిపతులుగా ఉన్నారు.
ఇదిలావుంటే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఇఒగా ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సిఇఒలుగా పనిచేస్తున్న టాప్-10 ప్రవాస భారతీయుల సంస్థల వ్యాపార విలువ 350 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం భారతీయ ఎగుమతుల మొత్తం విలువ కంటే ఇది 50 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇలా ప్రస్తుతం అంతర్జాతీయంగా మరెన్నో చిన్న సంస్థలకూ సిఇఒలుగా ప్రవాస భారతీయులు సేవలందిస్తుండగా, ప్రపంచంలో పేరొందిన 13 ప్రముఖ సంస్థలకు ఇప్పుడు భారతీయులే ముఖ్య కార్య నిర్వహణా అధికారులుగా ఉన్నారు.