ట్రేడింగ్ ఖాతా తెరవడం మరింత సులభం
దాదాపు అన్ని మార్కెట్లకు ఒకే రకమైన కెవైసి నిబంధనలు ఉండేలా సెబి చర్యలు తీసుకుంటోంది. తాజాగా కెవైసి నిబంధనల్లో వార్షికాదాయం, వృత్తి వివరాలను సంబంధించిన కాలమ్స్ను ఎత్తివేసింది. కేంద్రీకృత కెవైసి నమోదు సంస్థకు అవసరమైన వివరాలు మాత్రమే కెవైసి దరఖాస్తులో ఉంటే చాలని సెబి పేర్కొంది.
వృత్తి, ఆదాయం, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారు రాజకీయ సంబంధాలు వంటి వివరాలు కేంద్రీకృత కెవైసి నమోదు సంస్థకు అవసరం లేదని వెల్లడించింది. కెవైసి దరఖాస్తును మార్పులు చేయాల్సిందిగా మార్కెట్ ఇంటర్మీడియేటరీలకు సెబి సర్క్యూలర్ పంపింది. ఇందుకు 6 నెలల సమయం ఇచ్చింది. మార్కెట్లో భాగస్వామ్య వర్గాలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబి వివరించింది.
అప్పులు తగ్గుతాయి: మాంటెక్
చెన్నై: ఆర్థిక విధానాన్ని సరైన క్రమంలో పెట్టడం ద్వారా రాబోయే ఐదారేళ్లలో రుణ భారాన్ని భారత్ తగ్గించుకోగలదనే అభిప్రాయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వెలిబుచ్చారు. గురువారం తమిళనాడులోని చెన్నైలో మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సౌతర్న్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ రాజా జె చెల్లయ్య లెక్చర్ను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆర్థిక విధానంలో కొద్దిగా సర్దుబాట్లు చేసుకుంటే చాలని, సమూలమైన మార్పులు అవసరం లేదని అన్నారు. ‘రాబోయే ఐదు లేదా ఆరేళ్లలో జిడిపి స్థూల రుణ నిష్పత్తి తగ్గనుందని ఆయన తెలిపారు. ద్రవ్యలోటు కూడా తప్పక తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు.