ఎంఎన్సీల హెచ్సీలకు భారత్ అనువైనదే: మెకిన్సే
న్యూఢిల్లీ: బహుళ జాతి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపే దేశాల్లో భారత్
11వ స్థానంలో నిలిచినట్లు మెకిన్సే గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ తన నివేదికలో తెలిపింది. భారతదేశంలో బిలియన్ డాలర్లకు
పైగా ఆదాయాన్ని కలిగి ఉన్న 158 అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి.
మెకిన్సే గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. 158 అంతర్జాతీయ కంపెనీలు భారత్లో ఉన్నాయి. వీటి మొత్తం
ఆదాయం 898 బిలియన్ డాలర్లు. అత్యధికంగా 2,123 బహుళజాతి సంస్థల ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్న
అమెరికా నివేదికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంస్థల మొత్తం ఆదాయం 15,221 బిలియన్ డాలర్లుగా ఉంది.
అమెరికా తర్వాతి స్థానాల్లో జపాన్, చైనా, జర్మనీ, యూనైటెడ్ కింగ్డమ్లు ఉన్నాయి.
జపాన్ 1,028 కంపెనీలతో 7,347, చైనా 577 కంపెనీలతో 5,449, జర్మనీ 462 కంపెనీలతో 3,788, బ్రిటన్ 358
కంపెనీలతో 2,818 బిలియన్ డాలర్ల ఆదాయంతో టాప్ 5లో ఉన్నాయి. ఫ్రాన్స్ 236, ఆస్ట్రేలియా 203, కెనడా 194,
ఇటలీ 179, రష్యా 165 బహుళజాతి కంపెనీలు కలిగి ఉండి టాప్ 10లో నిలిచాయి. ఈ నివేదికలో భారత్కు 11వ
స్థానం లభించగా తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, తైవాన్, బ్రెజిల్లు నిలిచాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న 8వేల పెద్ద
కంపెనీలుండగా ఇందులో నాలుగింట మూడొంతుల కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నాయి. అమెరికా,
కెనడా, పశ్చిమ ఐరోపాల జనాభా ప్రపంచంలో 11శాతమే ఉన్నప్పటికీ అవి 50శాతానికి పైగా కంపెనీల ప్రధాన
కార్యాలయాలను కలిగి ఉన్నాయి. దక్షిణాసియా మొత్తం ప్రపంచ జనాభాలో 23శాతం ఉన్నా 2శాతం మాత్రమే దిగ్గజ
కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.