దీర్ఘకాలంలో మంచిగా సంపాదించాలంటే చక్కటి ఆర్థిక ప్రణాళిక
అన్ని విషయాలను తెలుసుకొని ఎంత తొందరగా మీ ప్రణాళికను ప్రారంభిస్తే అంత అధికంగా ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్కు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదో వాహనాన్ని ఉపయోగిస్తాం. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పక్కా ప్రణాళిక ఉండాల్సిందే. ఆర్థిక లక్ష్యాల్లో ఇది మరింత ముఖ్యం. పాఠశాలకు వెళ్ళే విద్యార్థి, మధ్య వయస్కులు, రిటైరైన వారు, గృహిణి ఇలా ఎవరైనా సరే ఆర్థిక ప్రణాళికను కలిగి ఉండాల్సిందే. చాలామంది వాస్తవ పరిస్థితులపై అంచనా లేకుండా లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవడంలో విఫలమవుతారు. దీనికి ప్రధాన కారణం వారి ఆదాయం, ఖర్చులు, సేవింగ్ చేయడానికి ఉన్న మిగులు నిధులు, ఇన్వెస్ట్ చేసిన వాటిపై వచ్చే రాబడి వంటి తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే. అన్ని విషయాలను తెలుసుకొని ఎంత తొందరగా మీ ప్రణాళికను ప్రారంభిస్తే అంత అధికంగా ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్కు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
పొదుపు, పెట్టుబడులపై అవగాహన ముఖ్యం
ఫైనాన్షియల్ ప్లానింగ్ను సిద్ధం చేసుకుంటున్నప్పుడు ముందుగా మీరు పొదుపు, పెట్టుబడులకు ఉన్న చిన్నపాటి తేడాపై అవగాహన పెంచుకోండి. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం సేవింగ్స్ను, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే వాటిని సేవింగ్స్గా, కొద్దిగా రిస్క్ ఉండి అధిక రాబడిని పొందడానికి వీలుండే వాటిని ఇన్వెస్ట్మెంట్స్గా వర్గీకరించవచ్చు. బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, బాండ్లు వంటివాటిని సేవింగ్స్గా, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బంగారం, రియల్ ఎస్టేట్, పీపీఎఫ్లను ఇన్వెస్ట్మెంట్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి మీ లక్ష్యానికి అనుగుణంగా సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోండి.
2. భద్రతా ముఖ్యమే..
ఎందులోనైనా మదుపు చేసేటప్పుడు రాబడి కంటే లిక్విడిటీ, భద్రతకే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. మీ క్యాపిటల్ ఎంత వరకు భద్రం, నగదు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకోవడానికి అవకాశమున్నదా అన్న విషయాలను పరిశీలించాలి. ఈ రెండు విషయాల్లో తృప్తి చెందిన తర్వాత రాబడిని ఎంత అందిస్తాయన్న అంశాన్ని అంచనా వేయాలి.
3. బీమా కూడా అవసరమే:
ఆర్థిక ప్రణాళికలో బీమా కూడా చాలా ముఖ్యమైన అంశం. బీమా పాలసీ తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. ఎంత బీమా రక్షణ ఉండాలనేది మీ రిస్క్ సామర్థ్యం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యులకు, ఆస్తులకు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి.
4. రెట్టింపు ఎప్పుడు అవుతుంది?
మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఎప్పటికి రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న సూత్రముంది. 72ను మీరు ఆశించే వడ్డీతో భాగించండి. వచ్చే శేషమే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికి రెట్టింపు అవుతుందో తెలియచేస్తుంది. ఉదాహరణకు మీరు 9 శాతం వడ్డీని ఆశిస్తున్నారనుకుందాం. ఇప్పుడు 72ని తొమ్మిదితో భాగిస్తే వచ్చే శేషం 8. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందన్న మాట.
5. కుటుంబ సభ్యులకు తెలియచేయండి:
మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ను ఒకేదాంట్లోకి కేటాయించకూడదు. మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా విభిన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించండి.అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కుటుంబ సభ్యులకు తెలియచేయడం చాలా ముఖ్యమన్న సంగతి మర్చిపోవద్దు. దీని వలన కుటుంబసభ్యులందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్పై అవగాహన రావడమే కాకుండా, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మిగిలిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరాశించిన లక్ష్యాలను చేరుకోగలరు. ముఖ్యంగా ఏయే పథకాల్లో ఇన్వెస్ట్ చేశారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మిగిలిన కుటుంబ సభ్యులకు తెలియచేయండి. మ్యూచువల్ ఫండ్స్, బీమా, బ్యాంకు అకౌంట్స్ వంటివాటిల్లో నామినీ సౌకర్యాన్ని తప్పక వినియోగించుకోండి. మొత్తం మీద మీ కుటుంబ సభ్యులకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్పైన పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. దీని వలన మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీ లక్ష్యాలకు అనుగుణంగా వారు నడుచుకునే వెసులుబాటు కలుగుతుంది.
6. ద్రవ్యోల్బణమూ ముఖ్యమే...
పొదుపుపై ద్రవ్యోల్బణం ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణమనేది మన కొనుగోలు శక్తిని తగ్గించేస్తుంది. సగటు ద్రవ్యోల్బణ రేటు 9 శాతం ఉందనుకుంటే మీ సేవింగ్స్పై పన్నులు ఇతర వ్యయాలు పోయిన తర్వాత కనీసం తొమ్మిది శాతం అంతకంటే ఎక్కువ రాబడి ఉండే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్స్పై 10 శాతం వార్షిక రాబడి వస్తోంది అనుకుందాం. అంటే సంవత్సరంలో రూ.10,000 ఆదాయం వస్తుందన్నమాట. ఆ సంవత్సరం ద్రవ్యోల్బణం రేటు 9శాతం ఉందనుకుందాం. అదే మీరు హై ట్యాక్స్ శ్లాబులో... అంటే 30 శాతం పన్ను పరిధిలో ఉంటే ఈ వచ్చిన మొత్తంపై *3,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే పన్నులు పోను రూ.7,000 మిగులుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం 9 శాతం పరిగణనలోకి తీసుకుంటే మీ వాస్తవ సంపాదన మైనస్ రెండువేలు అవుతుంది. అంటే పెరిగిన ధరలు మీ సంపాదనను హరించివేశాయన్నమాట.
7. తొందరగా ప్రారంభించండి
మీ ఆర్థిక ప్రణాళికను ఎంత తొందరగా మొదలు పెడితే అంత ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా వాయిదా వేసుకొని కొంత కాలం తర్వాత ప్రారంభిస్తే అప్పుడు అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కాంపౌండింగ్ (చక్రవడ్డీ) మహిమ.