ఆర్బీఐ ఈ పనులు చేస్తుందని మీకు తెలుసా..
భారతదేశంలో బ్యాంకులన్నింటికీ కేంద్రబ్యాంకుగా వ్యవహరించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్కు అధిపతి గవర్నర్. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 1949లో జాతీయం చేయబడి
భారతదేశంలో బ్యాంకులన్నింటికీ కేంద్రబ్యాంకుగా వ్యవహరించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్కు అధిపతి గవర్నర్. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. 1949లో జాతీయం చేయబడినప్పటి నుంచి ఆర్బీఐ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. చాలా మంది ఆర్బీఐ అంటే నోట్లు ముద్రించి ప్రజల్లోకి పంపుతుంది అనుకుంటారు. తెలియకుండా ఆర్బీఐ చేసే పనులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు నుంచి 10 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం
ఆర్బీఐ ప్రధాన కార్యాలయం మొదట్లో కోలకతలో ఉండేది. 1937లో ఆ కార్యాలయాన్ని ముంబయికి మార్చారు. ఉద్యోగుల శిక్షణ కోసం ఆర్బీఐ రెండు విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తోంది. చెన్నైలో రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజీ, మరోటి మహారాష్ట్రలోని పుణెలో వ్యవసాయ బ్యాంకింగ్ శిక్షణ కళాశాల ఉంది.
2. అంబేద్కర్ పాత్ర
ఆర్బీఐ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. "రూపాయి సమస్య- దాని పుట్టుపూర్వోత్తరాలు, పరిష్కారాలు" అనే పుస్తకాన్ని ఆయన రాశారు. అందులో ఆయన సూచించిన విషయాలను ఇండియన్ కరెన్సీ, ఆర్థిక విషయాలపై బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన రీగల్ కమీషన్ పరిగణనలోకి తీసుకుంది. తుదిగా ఆర్బీఐ చట్టం, 1934 ఏర్పాటు చేసినప్పుడు వాటినన్నింటిని అనుసరించారు.
3. ప్రయివేటు నుంచి ప్రభుత్వ సంస్థగా
ఇప్పుడున్న ఆర్బీఐ ఏప్రిల్ 1,1935లో ఏర్పాటయింది. ఇది వాటాదారుల బ్యాంకుగా మొదట్లో ఉండేది. ఆర్బీఐ జాతీయకరణ 1949లో జరిగింది. తర్వాత పూర్తి ప్రభుత్వ సంస్థగా మారింది. 1969లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయకరణ చేయడం దేశంలో కీలక మలుపు అయింది. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ 6 బ్యాంకులనే జాతీయకరణ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ అజమాయిషీ చేసే దానిగా ఆర్బీఐకి పూర్తి అధికారాలు సంక్రమించాయి.
4. ఆర్బీఐ పాత్ర
1947 వరకూ ఆర్బీఐ బర్మా దేశానికి సైతం కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో రెండేళ్లు జపాన్ కింద బర్మా ఉన్నప్పుడు మాత్రం ఆర్బీఐ ఆజమాయిషీ లేదు. పాకిస్థాన్ విషయంలో ఆగస్టు 14,1947 తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకుగా పనిచేసింది. జూన్ 1948లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ స్థాపన ద్వారా ఆర్బీఐ పక్క దేశంలో అజమాయిషీ చేయడం లేదు. ప్రారంభంలో ఆర్బీఐ ద్వంద్వ పాత్ర పోషించింది. అంటే ద్రవ్య విధానాన్ని, విత్త విధానాన్ని పాటించింది.
5. నోట్ల ముద్రణ
ఆర్బీఐ సొంత సంస్థ అయిన ది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ దేశంలో నోట్ల ముద్రణ వ్యవహారాలను చూస్తుంది. ఇది మైసూర్, పశ్చిమ బెంగాల్ కేంద్రాల్లో నోట్ల ముద్రణ కేంద్రాలను కలిగి ఉంది. ఇవే కాకుండా మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని దేవాస్ కేంద్రాల్లో సైతం నోట్ల ముద్రణ చేస్తున్నారు. ఆర్బీఐ కేవలం నోట్ల ముద్రణ వరకే పరిమితం అవుతుంది. నోట్లు కాకుండా కేవలం నాణేల ముద్రణను భారత ప్రభుత్వం చేపడుతుంది. చాలా మంది నోట్ల ముద్రణ, నాణేల ముద్రణ రెండూ ఆర్బీఐ ఒకటే చేపడుతుందని అనుకుంటారు.
6. మహిళా డిప్యూటీ గవర్నర్
ఆర్బీఐ ఇప్పటిదాకా గవర్నర్గా మహిళను కలిగి లేదు. అయితే ఒకసారి మహిళా డిప్యూటీ గవర్నర్ పని చేశారు. 1935లో ఆర్బీఐ ప్రారంభం నుంచి ఒకే ఒక మహిళా డిప్యూటీ గవర్నర్గా కేజీ ఉదేశీ పనిచేశారు. ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో 2003లో ఆమె డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
7. ఆర్బీఐ విస్తరణ
ఆర్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఢిల్లీ, కోల్కత, చెన్నై, ముంబయిలలో ఉన్నాయి. ఇతర ప్రాంతీయ కార్యాలయాలు 19 చోట్ల ఉన్నాయి. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, బెంగుళూరు, జైపూర్, గౌహతి, ఐజ్వాల్, డెహ్రాడూన్, చెన్నై, జమ్మూ, కొచ్చి, లక్నో, కోల్కతా, పాట్నా, నాగ్పూర్, ముంబై, పాట్నా మరియు తిరువనంతపురంలో 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతానికి సంబంధించి ఢిల్లీ, దక్షిణ భారతానికి సంబంధించి చెన్నై, పశ్చిమ ప్రాంతానికి సంబంధించి ముంబయి, ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కోల్కత ఆర్బీఐ
వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.
8. ఆర్బీఐ లోగో
ఈస్ట్ ఇండియా కంపెనీ డబుల్ మోహర్ ఆధారంగా ఆర్బీఐ సీల్ ఉంటుంది. నిజానికి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూపే ఉండేట్లు చేయాలని మొదట్లో అనుకున్నారు. ఇప్పటి లోగోలు ఒక సింహం బొమ్మ, తాటి చెట్లు ఉంటాయి. తర్వాతర్వాత సింహం స్థానంలో జాతీయ జంతువు అయిన పులిని తీసుకొచ్చారు. ఇప్పుడున్న ఆర్బీఐ లోగోలో పులి బొమ్ము, తాటి చెట్లతో కూడుకుని ఉంటాయి.
9. ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం
ఎక్కడైనా ఆర్థిక సంవత్సరం సాధారణంగా ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుంది. కానీ ఆర్బీఐ విషయంలో అలా కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం మాత్రం జులై 1తో మొదలై జూన్ 30తో ముగుస్తుంది. దేశంలో బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఆర్బీఐ ఏప్రిల్,మే, జూన్లలో మూడు నెలల పాటు క్షుణ్ణంగా బ్యాంకు ఖాతాలను పరిశీలించి వార్షిక నివేదిక తయారుచేస్తుంది. అలా జులై 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలెడుతుంది.
10. నోట్ల మార్పిడి
మనకు గత ఏడాది పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) జరిగినప్పుడు అదంతా ప్రభుత్వ కార్యక్రమంలా కనిపించింది. కరెన్సీ నోట్ల నిర్వహణను చేపట్టేది మొత్తం ఆర్బీఐనే. ఆర్బీఐ మొదట్లో రూ.5000, రూ.10,000 నోట్లను 1938లో రద్దు చేసింది. తర్వాత 1954లో మళ్లీ వాడుకలోకి తెచ్చారు. తర్వాత 1978లో మళ్లీ రద్దు చేశారు. ఆర్బీఐ చట్టం,1934 అనుసరించి కేంద్ర బ్యాంకు రూ.5000, రూ.10 వేల నోట్లను ముద్రించే అధికారాన్ని పొందింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. రూ.2000 నోట్లను చలామణీలోకి తెచ్చారు.