బ్యాంకు సేవలకు రుసుములుంటాయ్ జాగ్రత్త!
ఖాతాలో కొన్ని నెలలపాటు కనీస నిల్వ ఉంచకపోతే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. ఖాతా తెరిచినప్పుడు నియమ నిబంధనలను సరిగా చదవకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఏ విధమైన సేవలకు ఎ
ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలేనిదే ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కష్టం. బాగా సాంకేతికంగా అవగాహన ఉన్నవారు నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే అంత ఆసక్తి, టెక్నికల్ నాలెడ్జ్ లేనివారు చెక్కు,డీడీలను ఉపయోగించడం చేస్తారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఆయా సంస్థలే బ్యాంకు ఖాతా తెరవడంలో సాయం చేస్తాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు సాధారణంగా కొత్త ఖాతా తెరుస్తూ ఉంటారు. సౌలభ్యం కోసం బ్యాంకు ఖాతాలు తెరవడం అవసరమే. కానీ నియమనిబంధనలను సరిగా తెలుసుకోకపోతేనే ఇబ్బందులు ఎదురవుతాయి. నేను అసలు ఖాతానే ఉపయోగించలేదు, కానీ నా ఖాతాలో డబ్బులు లేకుండా పోయాయని చాలా మంది అంటూ ఉండటం మనం సాధారణంగా వింటూంటాం. అలాంటి వాటికి కారణం బ్యాంకులు విధించే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనే.
డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు, అవసరమైనప్పుడు సులువుగా వాడుకునేందుకు మనం బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కోసారి నెలలపాటు ఖాతాను కనీస నిల్వతో నిర్వహించకపోతే, డబ్బు వృద్ధి చెందడానికి బదులు ఉన్న సొమ్ము తరిగిపోతుంది. ఖాతాలో కొన్ని నెలలపాటు కనీస నిల్వ ఉంచకపోతే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. ఖాతా తెరిచినప్పుడు నియమ నిబంధనలను సరిగా చదవకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఏ విధమైన సేవలకు ఎలాంటి రుసుములు, కొన్నింటికి ఎలాంటి పెనాల్టీలు ఉంటాయో తెలుసుకుందాం.
నిర్లక్ష్యానికి పెనాల్టీ
ఒక్కోసారి కొన్ని చెల్లింపులు నిర్ణీత సమయానికి ఆటోమేటిక్గా జరిగేందుకు ఈసీఎస్ మ్యాండేట్ ఇస్తాం. ఒకసారి ఈసీఎస్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ తేదీ వచ్చేసరికి ఖాతాలో తగినంత నిల్వ ఉండేలా చూడాల్సిన బాధ్యత ఖాతాదారుదే. ఒకవేళ అలా నగదు నిల్వ నిర్వహించకపోతే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. యాక్సిస్ బ్యాంకు మొదటిసారి ఈసీఎస్ ఫెయిల్ అయితే రూ.350, తదుపరి ఫెయిల్ అయిన ఈసీఎస్ లావాదేవీలకు రూ. 750 పెనాల్టీ విధిస్తుంది. హెచ్డీఎఫ్సీ ఈసీఎస్ ఫెయిల్ అయిన ప్రతిసారి రూ. 200 పెనాల్టీ విధిస్తోంది.
ఖాతా రద్దు కోసం
బ్యాంకులను బట్టి, ఖాతా రకాన్ని బట్టి రద్దు కోసం ఛార్జీలు ఉంటాయి. దాదాపు అన్ని బ్యాంకులు రూ. 100 నుంచి రూ. 1200 వరకూ రుసుము వసూలు చేస్తున్నాయి. ఖాతా తెరిచిన సంవత్సరంలోగా మూసివేసేందుకు సిద్ధపడితే రుసుములు విధిస్తున్నాయి. అదే సంవత్సరం తర్వాత అయితే చాలా బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా ఖాతా రద్దుకు అంగీకరిస్తున్నాయి.
డూప్లికేట్ స్టేట్మెంట్స్:
చాలా బ్యాంకులు ఈ-స్టేట్మెంట్స్ను నేరుగా మెయిల్కు పొందే అవకాశాన్ని ఉచితంగా కల్పిస్తున్నాయి. కాగితం రూపంలో కావాలంటే రుసుమును విధిస్తున్నాయి. స్టేట్మెంట్ కావాలని నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్ ద్వారా అభ్యర్థించేందుకు వీలుంది. కస్టమర్ కేర్(ఐవీఆర్)కు ఫోన్ చేసి కూడా స్టేట్మెంట్ కావాలని కోరే వీలుంది. ఇలా మన ఇంటికి స్టేట్మెంట్ తెప్పించుకునేందుకు బ్యాంకులు రూ. 50 నుంచి రూ. 100 వరకూ వసూలు చేస్తున్నాయి.
డూప్లికేట్ పాస్బుక్:
డూప్లికేట్ పాస్బుక్ జారీ చేసేందుకు రూ. 100 వరకు బ్యాంకులు రుసుము విధిస్తున్నాయి. 40 ఎంట్రీలను ఒక లెడ్జర్గా భావిస్తున్నారు. పాస్బుక్లో ఒక లెడ్జర్ నమోదు కోసం రూ. 60 నుంచి రూ. 120 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
డీడీ జారీ కోసం:
రూ. 5,000 వరకూ ఉండే డీడీలకు రూ.20 నుంచి రూ. 50 వరకూ ; రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకూ రూ. 40 నుంచి రూ. 100 వరకూ రుసుములు ఉంటున్నాయి.
ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ కోసం :
ఖాతాలో లావాదేవీలను మొబైల్లోనే వచ్చేలోగా చేసుకునేందుకు ప్రస్తుతం అందరరూ ఇష్టపడుతున్నారు. అయితే దీనికి నిర్ణీత రుసుములు ఉంటున్నాయి. త్రైమాసికానికి రూ. 5 నుంచి రూ. 15 వరకూ బ్యాంకులు రుసుములు విధిస్తున్నాయి.
ఏటీఎమ్ జారీ కోసం:
మొదటిసారి ఖాతా తెరిచినప్పుడు ఏటీఎమ్ జారీ చేసినందుకు రూ. 100 వరకు సేవారుసుము విధిస్తారు. కార్డు పోగొట్టుకుంటే కొత్త కార్డు కోసం రూ. 100 నుంచి రూ. 150 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు ఏటీఎమ్ కార్డు పాడైపోయినప్పుడు కొత్త కార్డు కోసం ప్రయత్నించినా రుసుములను వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఏటీఎమ్ కార్డును అవసరం లేనప్పుడు పదిలంగా భద్రపరుచుకోండి.
ఏటీఎమ్లో లావాదేవీలు:
సొంత బ్యాంకు ఏటీఎమ్ల్లో ఐదు లావాదేవీలకు మించితే రుసుము విధించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. మెట్రోనగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎమ్ల్లో అయితే ఐదు, వేరే బ్యాంకు ఏటీఎమ్ల్లో అయితే మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. ఐదుకు మించిన లావాదేవీలకు రూ. 20, సేవా రుసుము కలిపి విధిస్తారు.
* ఇక్కడ చాలా మంది మొత్తం లావాదేవీల విషయంలో గందరగోళపడతారు. మొత్తం ఏటీఎమ్ లావాదేవీలు ఐదుకు మించితే రుసుములు ఉంటాయి. అంటే ఇతర బ్యాంకు ఏటీఎమ్ల్లో మూడు, సొంత బ్యాంకు ఏటీఎమ్ల్లో రెండు లావాదేవీలు జరిపినా మొత్తం ఐదు లావాదేవీలు పూర్తయినట్లే. వీటికి మించిన లావాదేవీలకు రుసుములు వసూలు చేస్తారు.
* ఏటీఎమ్కు వెళ్లి ఖాతాలో నిల్వ ఎంత ఉందో చూసినా, చెక్బుక్ కోసం అభ్యర్థించినా అది ఆర్థికేతర లావాదేవీ కింద వస్తుంది. ఇటువంటి వాటికి రూ. 8.50, సేవారుసుము కలిపి వసూలు చేస్తారు.
ఇవన్నీ దేశంలోని ఆరు మెట్రో నగరాలకు వర్తిస్తాయి.
చెక్కు సంబంధిత సేవలు
పొదుపు ఖాతా ఉన్నవారికి ఖాతా ప్రారంభంలో చెక్కు పుస్తకం ఉచితంగానే జారీచేస్తారు. దాని తర్వాత తీసుకునే వారికి ఒక్కో చెక్కు పత్రానికి రూ. 2 నుంచి 3 వరకూ రుసుములు విధిస్తున్నారు. చెక్ లీఫ్లను అనవసరంగా వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి.
చెల్లని చెక్కు విషయంలోనైతే:
జారీ చేసిన చెక్కు ఏ కారణంతోనైనా చెల్లకపోతే రూ. 100 నుంచి రూ. 750 వరకూ అపరాధ రుసుములను బ్యాంకులు విధిస్తున్నాయి.
అదే విధంగా చెక్కు జారీని ఆపాల్సిందిగా కోరినా రూ. 50 నుంచి రూ. 350 వరకూ పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.
విదేశాల నుంచి నగదు బదిలీ:
వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ వంటి నగదు బదిలీ సౌకర్యాల ద్వారా విదేశాల నుంచి నగదును స్వీకరించవచ్చు.
ఈ విధంగా పొందే డబ్బు మనీ లాండరింగ్కు సంబంధించినదై ఉండకూడదు.
ఖాతా కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
బ్యాంకును బట్టి సేవారుసుములు మారుతూ ఉంటాయి.
మల్టీ సిటీ చెక్కు సౌకర్యం:
బ్యాంకులు రూ. 50000 నుంచి రూ. 500000 వరకూ మల్టీ సిటీ చెక్కు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ఒక పరమితి మేరకు చాలా బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.
ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులు కనీస నిల్వ కరెంటు, పొదుపు ఖాతాదారులకంటే ఎక్కువ పరిమితి మేరకు మల్టీ సిటీ చెక్కులను పొందే వీలుంది.
వీటికి ప్రత్యేక రుసుములు విధించే అవకాశముంది. బ్యాంక్ వెబ్సైట్ల నుంచి ఈ వివరాలను పొందవచ్చు.
అవుట్స్టేషన్ చెక్కును నగదుగా మార్చుకునేందుకు రూ. 25 నుంచి రూ.200 వరకూ రుసుము విధిస్తున్నారు.
డెబిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు:
ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, పాదరక్షలు వంటివి కొన్నప్పుడు చెల్లింపు కార్డు ద్వారానా లేదా నగదా అని అడుగుతారు. కార్డు ద్వారా అయితే 2% అదనపు భారం వహించాల్సి ఉంటుంది. షాపింగ్మాల్స్, సూపర్ మార్కెట్స్ 1-2% నిర్వహణ రుసుముగా వసూలు చేస్తున్నాయి.
కనీస నిల్వ(మినిమమ్ బ్యాలెన్స్) నిర్వహించకపోతే
ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వ లేనప్పుడు అధిక రుసుములను విధిస్తాయి. ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వ లేనప్పుడు అధిక రుసుములను విధిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస నిల్వ పాటించాలనే నిబంధనను తొలగించాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. ఒక్కోసారి మన ఖాతాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కానీ సగటు కనీస నిల్వ లేకపోతే మనం మూల్యం చెల్లించుకోకతప్పదు. పట్టణ, నగర ప్రాంతాలో రూ.10,000 గాను, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో రూ. 5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 నుంచి రూ. 2500 వరకూ కనీస నిల్వగా ఖాతాలో ఉంచాల్సిందిగా ప్రైవేటు బ్యాంకుల నిబంధనలు ఉంటున్నాయి. ఇక్కడ కనీస నిల్వ ఉంటే సగటు కనీస నిల్వ. అంటే ప్రతి రోజూ ఖాతాలో అంత ఉంచాల్సిన అవసరం లేదు. నెలకు, లేదా త్రైమాసికానికి బ్యాంకు నిబంధనల మేరకు సగటు నిల్వ ఉండాలి. సాధారణంగా పొదుపు ఖాతాల్లో ఉండే డబ్బుకు 4 శాతం వడ్డీ వస్తుంది. రూ. 10,000కు సంవత్సరానికి వచ్చే వడ్డీ 400. మన ఖాతాలో కనీస నిల్వ లేకపోతే మనం కోల్పోయే మొత్తం అంతే ఉంటుంది. వడ్డీని ఆరు నెలలకొకసారి మాత్రమే జమ చేస్తారు. ప్రైవేటు బ్యాంకులన్నీ దాదాపుగా నెల వారీ కనీస సగటు ఆధారంగా రుసుములు విధిస్తాయి.
త్రైమాసిక నిల్వ లెక్క ఎలా?
త్రైమాసిక నిల్వను ఈ విధంగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఏప్రిల్1 - జూన్ 30
జులై1 - సెప్టెంబరు30
అక్టోబరు1 - డిసెంబరు31
జనవరి1 - మార్చి31
ఖాతాలో కొంతకాలం కనీస నిల్వ లేనప్పుడు పెనాల్టీల వల్ల నెగటివ్ బ్యాలెన్స్లోకి వెళుతుంది. ఎప్పుడైనా నగదు జమ చేస్తే అది నెగటివ్ బ్యాలెన్స్కు తగ్గట్టుగా సరిచేస్తారు. నెల వారీ రుసుమలు విధించేట్లయితే నెల చివర్లో ఖాతా నుంచి సొమ్మును మినహాయిస్తారు. త్రైమాసికానికి ఒకసారి అయితే త్రైమాసికం చివర్లో మినహాయిస్తారు.
ఈ పెనాల్టీని నివారించాలంటే:
1. పొదుపు ఖాతాలను సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ పోస్టాఫీసుల్లో కానీ తెరిచేందుకు ప్రయత్నించండి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎమ్లను ఉపయోగించని వారైతే పోస్టాఫీసులు ఉత్తమ ఎంపిక.
2. నిరుపయోగమైన ఖాతాలను తక్షణమే మూసివేస్తే మంచిది. అన్ని అవసరాలను తీర్చే(డీమ్యాట్, ఆన్లైన్ బ్యాంకింగ్) ఒకే ఖాతాను కొనసాగిస్తే ఖాతాల నిల్వ ఎప్పటికప్పుడు సరిచూసుకునే బాధ తప్పుతుంది.
3. ఎంత ప్రయత్నించినా వీలు కాకపోతే మీ ఖాతాలను కొనసాగిస్తూనే చిన్న జాగ్రత్తలు పాటించాలి. సగటు నిల్వ ఉందో లేదో చూసుకోవడానికి వీలుగా రిమైండర్లను ఉంచుకోండి. పెనాల్టీ విధించకుండా ఉండేందుకు వీలుగా కనీస నిల్వ
ఉంచి తర్వాత ఆ మొత్తాన్ని అసవరాలకు వాడుకుంటే రుసుముల భారాన్ని తప్పించుకోవచ్చు.