కచ్చితమైన, సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఒకటి ఫిక్స్‌డ్ డిపాజిట్. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో తేడాలు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడానికి కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తంతో, ఒకే కాలపరిమితికి ఎఫ్‌డీ చేసిన ఇద్దరు కస్టమర్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడానికి వీల్లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏ బ్రాంచ్‌లో డిపాజిట్ చేసినా.. అదే బ్యాంకులో ఒకే తరహా ఎఫ్‌డీకి అందరికీ ఒకే వడ్డీ రేటు చెల్లించాలని ఆదేశించింది. ఈ కొత్త రూల్ 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Advertisement

ఇప్పటివరకు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఒకే తరహా డిపాజిట్‌పై కస్టమర్ రిలేషన్, బ్రాంచ్, ఇతర కారణాల ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేసే అవకాశం ఉండేదని చెబుతున్నారు. దీంతో ఒకే బ్యాంకులో ఒకే మొత్తం పెట్టుబడి పెట్టినా ఇద్దరు కస్టమర్లు వేర్వేరు రిటర్న్స్ పొందే పరిస్థితులు ఉండేవని పేర్కొంటున్నారు. అందుకే కొత్త ఆదేశాలతో అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇకపై ఒకే రోజు ఒకే కాలవ్యవధితో చేసిన రిటైల్ ఎఫ్‌డీలకు ఒకే వడ్డీ రేటు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Advertisement

ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించాలి. వెబ్‌సైట్‌లో ప్రకటించిన రేట్లకే బ్యాంకులు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లు వివిధ చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీ రేట్లను సులభంగా పోల్చుకునే అవకాశం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే రూ.3 కోట్లకు పైబడిన బల్క్ డిపాజిట్ల విషయంలో మాత్రం బ్యాంకులకు కొంత వెసులుబాటును కల్పంచారు. ఇలాంటి భారీ డిపాజిట్లపై అవసరాన్ని బట్టి వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వవచ్చని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు జారీ చేసే రుణాలు, నిర్ణయించే వడ్డీ రేట్లకు సంబంధించిన నిబంధనల్లో పారదర్శకత, ఏకరూపత తీసుకురావడానికి ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు చేసింది.

Advertisement

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రస్తుతం వడ్డీని లెక్కించడానికి ఉపయోగించే రోజులను ప్రామాణీకరించాలని ఆర్‌బీఐ కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనివల్ల ఆయా బ్యాంకుల మధ్య వడ్డీల్లో ఉన్న వ్యత్యాసాలు తొలగి పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను బ్యాంకులు నెల, 3 నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి మారుస్తుండడం వల్ల బ్యాంకుల మధ్య ఏకరూపత కొరవడిందవని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి . త్వరలో ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.