దేశీయ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో కాపురం పెట్టడం అంటే లక్షల రూపాయలు చేతులో పెట్టుకోవాల్సిందే. ఒక మంచి అద్దె ఇల్లు వెతుక్కోవడం అంటే ఇంకా తీవ్రమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అయితే Bengaluru నగరంలో ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే.. యజమానులు అడిగే భారీ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం అద్దెదారులకు అంతకంటే పెద్ద తలనొప్పిగా మారింది.

Advertisement

ఏళ్లుగా ఈ నగరంలో యజమానులు తమకు తోచినట్లు 6 నుండి 10 నెలల అద్దెను డిపాజిట్‌గా వసూలు చేయడం ఒక అనధికారిక పద్ధతిగా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక అద్దెదారు చేసిన పోస్ట్.. ఈ డిపాజిట్ల దోపిడీపై, చట్టపరమైన పరిమితులపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement

స్నేహా తమ్హంకర్ అనే 'X' వినియోగదారు బెంగళూరులో జరుగుతున్న ఈ డిపాజిట్ వ్యవహారాన్ని అతిపెద్ద అద్దె కుంభకోణంగా అభివర్ణించారు. చాలామంది అద్దెదారులు చట్టపరమైన నిబంధనలను స్వయంగా సరిచూసుకోకుండా.. బ్రోకర్లు లేదా ఇంటి యజమానులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రోకర్లు అద్దెదారుల వద్దకు వచ్చి.. మేడమ్, కొత్త చట్టం ప్రకారం డిపాజిట్ 3 నెలలు మాత్రమే. మేము సాధారణంగా 6 నెలలు వసూలు చేస్తాం. కానీ మీకోసం ప్రత్యేకంగా 4 నెలలకు తగ్గిస్తున్నాం అంటూ రాయితీ ఇస్తున్నట్లు నమ్మిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్నారని ఆమె ఆరోపించారు. నిజానికి చట్టబద్ధంగా వసూలు చేయాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం కేవలం రెండు నెలల అద్దె మాత్రమేననే విషయం తనకు ఇప్పుడే తెలిసిందని ఆమె పేర్కొనడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Advertisement
బెంగళూరు రెంట్ షాక్.. 1BHK కి రూ. 45 వేల అద్దె.. రూ.24 లక్షల జీతం ఖాళీ..ఆ ఏరియాకు గుడ్ బై చెప్పిన టెకీ..

ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. నగరంలోని అద్దెదారులు, యజమానులు రెండు వర్గాలుగా విడిపోయి తమ భిన్నాభిప్రాయాలను పంచుకోవడం మొదలుపెట్టారు. నగరంలో 10 నెలల అద్దెను డిపాజిట్‌గా ఇవ్వడం ఒక సాధారణ పద్ధతిగా మారిపోయిందని కొందరు వాపోగా.. అద్దె చట్టాలను ఇక్కడ ఎవరూ సరిగ్గా పాటించడం లేదని, ఇదంతా కేవలం యజమానులు-అద్దెదారుల మధ్య జరిగే బేరసారాల పైనే ఆధారపడి నడుస్తోందని మరికొందరు వ్యాఖ్యానించారు. భారతీయ చట్టాల్లో అసలు డిపాజిట్‌పై ఖచ్చితమైన పరిమితులు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు.

Advertisement

అయితే ఈ విమర్శలపై పలువురు ఇంటి యజమానులు తమ వైఖరిని సమర్థించుకున్నారు. కొందరు అద్దెదారులు ఇళ్లను ఖాళీ చేసే సమయంలో రకరకాల కారణాలు చెబుతూ రెండు మూడు నెలల పాటు అద్దె చెల్లించకపోవడం.. పైగా ఇంటి ఫర్నిచర్ లేదా ఆస్తిని తీవ్రంగా పాడుచేసి వెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక నష్టాల నుండి యజమానులకు రక్షణగా ఉండాలంటే కనీసం 4 నుండి 6 నెలల అద్దెను డిపాజిట్‌గా తీసుకోవడం సమంజసమేనని వారు వాదించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారుల హక్కులు, యజమానుల భద్రతపై తీవ్రమైన చర్చను సోషల్ మీడియాలో కలిగించింది.