అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. జూన్ 17న కుదిరిన 14 అంశాల మధ్యంతర అవగాహన ఒప్పందం (MoU) ముగిసిపోయిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సైన్యం ఇరాన్పై సరికొత్త విడత వైమానిక దాడులను ప్రారంభించింది.
ఈ రాత్రి వారిపై మళ్లీ గట్టిగా దెబ్బ కొడతామని ట్రంప్ ఇచ్చిన సంకేతాలకు అనుగుణంగానే ఈ దాడులు జరిగాయి. కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడానికే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) స్పష్టం చేసింది.
అమెరికా జరిపిన ఈ తాజా దాడుల కారణంగా ఇరాన్ దక్షిణ తీరప్రాంతంలోని ఓడరేవు నగరాలైన సిరిక్, బందర్ అబ్బాస్, జాస్క్, కోనారక్, చబహార్లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. బందర్ అబ్బాస్లో వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేయగా.. చబహార్లో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.
అలాగే బుషెహర్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బ్యారక్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో వివాదంలో ఉన్న అబు మూసా ద్వీపాన్ని కూడా రెండు అమెరికా క్షిపణులు తాకాయి. ఈ దాడుల అనంతరం ట్రంప్ తన 'ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ..ఇది నిన్న ఇరాన్ ఓడలపై జరిపిన బాంబు దాడికి ప్రతీకారం. ఇది మళ్లీ జరిగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో పేలుళ్లు సంభవించగా, కువైట్ తన వైపు వచ్చిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. అటు ఖతార్ సైతం తమ దేశంలో భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్, ప్రధాన సంధానకర్త మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఎక్స్ (X) వేదికగా అమెరికాను తీవ్రంగా హెచ్చరిస్తూ.. మీరు దాడి చేస్తే, దెబ్బ తింటారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ ఒప్పందాల ప్రకారమే తెరుచుకుంటుంది కానీ అమెరికా బెదిరింపులకు కాదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యలకు తాము అసభ్యతతో కాకుండా నిర్భయమైన శౌర్యంతో, చర్యలతోనే సమాధానం ఇస్తామని ప్రకటించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ బుధవారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వన్ నుండి ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇరాన్ కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేసిందని, తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని చాలా బలంగా కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. అయితే వారు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తారో లేదో తనకు తెలియదని, అందుకే చర్చలు సమయం వృధా అని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జూన్ 26, 27 తేదీల్లో జరిగిన దాడుల అనంతరం ఇరుపక్షాలు వెనక్కి తగ్గినప్పటికీ, మంగళవారం జలసంధిలో మూడు ట్యాంకర్లపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమై.. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్రమైన కాల్పుల మార్పిడికి దారితీసింది.
More Articles
- ఇరాన్కు లాస్ట్ ఛాన్స్.. భీకర దాడులకు ట్రంప్ బిగ్ స్కెచ్.. నీ పిల్ల బెదిరింపులకు భయపడాలా అంటూ ఇరాన్ కౌంటర్..
- ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటన.. ఫార్మా రంగానికి బిగ్ షాక్.. భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
- Dinosaur skeleton: రూ.482 కోట్లు పలికిన డైనోసార్ అస్థిపంజరం..
- ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు.. హార్ముజ్ తర్వాత సౌదీ షిప్పింగ్కు పెను ముప్పు..
- Crude Oil: 90 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా..!
- అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు.. జీరో అవర్ హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..