పశ్చిమాసియాలో రగులుతున్న వార్ తీవ్రరూపం దాల్చుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇరాన్‌పై ఇప్పటివరకు జరిపిన సైనిక చర్యలన్నింటి కంటే అత్యంత భారీ దాడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని.. దీనిపై నిర్ణయం తీసుకునే సమయం చాలా దగ్గరపడిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామం మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయ పరిస్థితులను మరింత సందిగ్ధంలోకి నెట్టివేసింది.

Advertisement

గత రెండు వారాలుగా అమెరికా దళాలు ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలే లక్ష్యంగా నిరంతరం వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక శిబిరాలపై దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. తమ దళాలు మునుపెన్నడూ చూడని రీతిలో సునిశిత, భారీ స్థాయి దాడులకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఒకవేళ తాను కోరితే ఇజ్రాయెల్ కేవలం రెండు నిమిషాల్లో తమతో కలిసి ఆపరేషన్‌లో పాల్గొంటుందని చెప్పిన ట్రంప్.. అయితే ఆ నిర్ణయం వల్ల ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన కచ్చితమైన సమయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు.

Advertisement

మరొకవైపు గత ఐదు నెలలుగా సాగుతున్న ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు.. నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి పాకిస్థాన్ ముమ్మర దౌత్య యత్నాలు చేస్తోంది. దౌత్య మార్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మోమెనీ కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఇస్లామాబాద్‌లో పర్యటించారు. పాకిస్థాన్ రక్షణ శాఖ అధిపతి అసిమ్ మునీర్, ఇతర అగ్రనాయకులతో ఆయన కీలక భేటీలు నిర్వహించారు. శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్ సాగిస్తున్న ఈ కృషి అంతర్జాతీయ విపణిపై సానుకూల ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టగా.. బ్యారెల్‌కు గరిష్ట స్థాయిలకు చేరిన ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి.

Advertisement
అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు.. జీరో అవర్ హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..

ఇరాన్ సైనిక కార్యకలాపాలకు రష్యా, చైనా దేశాలు వెనుకనుండి సహకరిస్తున్నాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆరోపణలు చేసినప్పటికీ.. Trump ఈ విషయాన్ని అందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో జరిగిన చర్చల అధారంగా.. ఆ రెండు దేశాలు నేరుగా ఇరాన్‌కు సైనికపరంగా సహాయపడటం లేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ దేశాలు ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తే.. అది ఆ రెండు దేశాల ఆర్థిక, దౌత్య శ్రేయస్సుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కూడా అమెరికాతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ.. స్పష్టమైన నిబంధనలతో ఒప్పందానికి రాకముందే దాడులు కొనసాగుతాయని స్పష్టమవుతోంది.

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, దాడుల బెదిరింపులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ.. టెహ్రాన్ ఎలాంటి బెదిరింపులకు భయపడదని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అమెరికా ఏకపక్షంగా ఉద్రిక్తతలను పెంచుతోందని విమర్శించారు.అమెరికా కనుక ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు లేదా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే.. అమెరికా ప్రయోజనాలు ఉన్న ప్రాంతీయ ఇంధన వసతులు, స్థావరాలపై ఇరాన్ ప్రతికార దాడులు చేస్తుందని హెచ్చరించింది. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా గట్టిగా తిప్పికొడతామని ఇరాన్ సైనిక వర్గాలు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా తెలిపాయి.

Advertisement

హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమ సార్వభౌమ హక్కు అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా బలగాలు ఈ ప్రాంతంలో ఉన్నంత కాలం సురక్షిత ప్రయాణం సాధ్యం కాదని, ఇరాన్‌తో ముందస్తు సమన్వయం చేసుకున్న నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుందని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్, సైనిక అధికారులు స్పష్టం చేశారు. బెదిరింపుల నడుమే ఇరాన్ తన ప్రతికార చర్యలను కొనసాగిస్తోంది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లతో ప్రతిదాడి జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ధృవీకరించింది.