హైవేలపై ప్రయాణించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ నిలిచే వాహనాలు.. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు కేంద్రం గుడ్ బై చెప్పే దిశలో కీలక అడుగు పడింది. కొత్త విధానం ద్వారా ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా.. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా సంచలనాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఢిల్లీ-జైపూర్ (NH-48) నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులు టోల్ చెల్లించడానికి ప్లాజాల వద్ద బండిని నిలిపివేయాల్సిన అవసరం లేకుండా బహుళ-లేన్ల ఫ్రీ-ఫ్లో టోలింగ్ (Multi-lane Free-flow Tolling) విధానాన్ని అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త సాంకేతిక వ్యవస్థను తొలిదశగా మనోహర్పురా, దౌలత్పురా Toll ప్లాజాల వద్ద నేడు విజయవంతంగా ప్రారంభించారు. త్వరలోనే షాజహాన్పూర్ టోల్ ప్లాజాను కూడా ఈ ఆధునిక వ్యవస్థలోకి విలీనం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విధానంలో టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి గేట్లు, బారికేడ్లు లేదా ఇతర అడ్డంకులు (Barriers) ఉండవు.
వాహనాలు తమ సాధారణ వేగంతో వెళ్తున్నప్పుడే.. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్ను వెంటనే స్కాన్ చేస్తాయి. దీని ఆధారంగా వాహనానికి అనుసంధానమై ఉన్న ఫాస్టాగ్ (FASTag) ఖాతా నుండి ఆటోమేటిగ్గా టోల్ రుసుము మినహాయించబడుతుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఫాస్టాగ్ నేరుగా స్కాన్ కాకపోయినా.. నంబర్ ప్లేట్ ఆధారంగానే చెల్లింపు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుంది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ఎన్హెచ్ఏఐ కొన్ని కీలకమైన ముందస్తు జాగ్రత్తలను సూచించింది. ప్రయాణానికి ముందే వాహనదారులు తమ ఫాస్టాగ్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, అందులో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
బెంగళూరు వాహనదారులకు షాక్.. NICE రోడ్, ఈ-సిటీ ఫ్లైఓవర్ కొత్త టోల్ ఛార్జీలు అమల్లోకి..
అలాగే, ఫాస్టాగ్ స్టిక్కర్ వాహనం విండ్స్క్రీన్పై సరైన స్థానంలో అతికించి ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు, హై-స్పీడ్ కెమెరాలు సులభంగా విశ్లేషించేలా వాహనం నంబర్ ప్లేట్ దుమ్ము, ధూళి లేకుండా స్పష్టంగా, శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు. ఒకవేళ టోల్ మినహాయింపు ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
టోల్ ప్లాజాల వద్ద నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోవడం వల్ల వాహనాల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా రద్దీ సమయంలో ఏర్పడే ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలకవచ్చని ప్రయాణికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-జైపూర్ మార్గంలో ప్రవేశపెట్టిన ఈ ఫ్రీ-ఫ్లో టోలింగ్ సాంకేతికత విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జాతీయ రహదారులకు కూడా ఈ విప్లవాత్మక విధానాన్ని విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
More Articles
- ఈ ఏడాది చివరి నుంచి టోల్ ప్లాజాలు రద్దు.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. కొత్తగా ఏం తెస్తున్నారంటే..
- అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్
- FASTag: ఇది గుర్తుకు ఉందా, ఫిబ్రవరి 15 నుండి తప్పనిసరి
- వాహనదారులకు గుడ్న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు
- జనవరి 1 నుండే మార్పు... ఫాస్టాగ్ లేకుంటే వాచిపోతుంది.. డబుల్ టోల్ట్యాక్స్
- Bharat Bandh: బ్యాంకులు, ట్రాన్స్పోర్ట్పై ప్రభావం, ఎవరేమన్నారు..