తెలంగాణ రోడ్డు రాష్ట్ర రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. అయితే ఇది కేవలం ఓకే రూట్ లో ఉంటుంది. అదీ కూడా సాయంత్రం మాత్రమే. హైదరాబాద్- బెంగళూరు సర్వీసుల్లో శంషాబాద్ వరకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే వారికి ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు వెళ్లే వారు ట్రాఫిక్ చిక్కుకుని మహాత్మ గాంధీ బస్ స్టేషన్ కు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

అలాంటి వారి కోసం ఆర్టీసీ ఫ్రీ పుష్పక్ ఏసీ ఫీడర్ సర్వీసును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఏసీ బస్సుల్లో ఉచితంగా తిరగడానికి సాయంత్రం 6 గంటల తర్వాత బయలుదేరే హైదరాబాద్‌-బెంగళూరు సర్వీసుల్లో శంషాబాద్‌ (ఆర్‌జీఐ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా) బోర్డింగ్‌ పాయింట్‌గా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసమే శంషాబాద్‌ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించింది. ఆయా ప్రయాణికులను ఏసీ, పుష్పక్‌ బస్సుల్లో శంషాబాద్‌ వరకు ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు వివరించింది.

Advertisement

నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ చేరుకునేందుకు చాలా సమయం పడుతుంది. మియాపూర్‌, నిజాంపేట్‌, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు శంషాబాద్‌ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రయాణీకులు తమ బెంగళూరుకు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకునే సమయంలో శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

రిజర్వేషన్ టికెట్‌ చూపించి AC, AJ లేదా AK పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ ఏసీ సర్వీసుల్లో క్రింది బోర్డింగ్ పాయింట్లలో ఏదైనా ఒక చోటు నుంచి శంషాబాద్ వరకు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత అక్కడ తమకు రిజర్వేషన్ ఉన్న బెంగళూరు సర్వీసు బస్సు ద్వారా ప్రయాణం సాగించవచ్చని అధికారులు వెల్లడించారు. జేబీఎస్, సికింద్రాబాద్, ప్రకాశ్ నగర్, పర్యాటక్ భవన్, కేర్ ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మెహదీపట్నం, అరంఘర్, మీయపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, మలేషియా, శిల్పారామం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, మదినగూడ, అల్వీన్ ఎక్స్ రోడ్, హఫీజ్ పేట, కొండాపూర్, కొత్తగూడ ఎక్స్ రోడ్, బోటనికల్ గార్డెన్ వద్ద బస్ ఎక్కొచ్చు.