బంగారం ధరలు గత ఏడాదిన్నరగా పెరుగుతూ వస్తున్నాయి. ఓ సందర్భంలో పసిడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40, 000 నుంచి రూ.1,50,000 మధ్య కొనసాగుతోంది. గురువారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 820 పెరిగి రూ.1,44,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,32,300 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ. రూ.620 పెరిగి రూ.1,08,250 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

అయితే దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులను కొనుగోళ్లకు దూరంగా ఉంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికం కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6 శాతం పడిపోయిందని తెలుస్తోంది. పసిడి డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా 'క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్' నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి డిమాండ్ ఉన్నట్లు వివరించింది.

Advertisement

డిమాండ్ తగ్గినా భారీగా పెరిగిన ధరల కారణంగా విలువ రూపంలో బంగారం వాణిజ్యం సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగ విలువ గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరిందని నివేదికలో వివరించింది. 2025 క్యూ2లో ఇది రూ.1,32,500 కోట్లుగా ఉంది. భౌతిక పరిమాణం తగ్గినా భారతీయుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో పసిడికే ప్రథమ స్థానం దక్కుతోందని డబ్ల్యూజీసీ తన నివేదికలో తెలిపింది. అయితే ఆభరణాలు కొనుగోలు భారీగా పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

Advertisement

క్యూ2లో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పరిమితమైందని తెలిపింది. పసిడి ధరలు నిరంతరం రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనుకావడం, వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం కూడా బంగారానికి డిమాండ్ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో రీటైల్ ధరలు మరింత పెరిగాయని నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. సుంకాలు పెరగడంతో అక్రమ రవాణా పెరిగిపోతోందని, ఇది అధికారిక బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించింది. ఈ సంవత్సరం భారత్‌లో పసిడి డిమాండ్ 650-750 టన్నుల మధ్య ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దసరా, దీపావళి వరకు బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.