మహిళలకు గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకునే ప్రతి మహిళకు 8 గ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నారు. అలాగే పుట్టిన బిడ్డకు ప్రభుత్వం బంగారు ఉంగరం కూడా ఇవ్వనుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు తమిళనాడులో. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడ్జెట్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగింది.

Advertisement

ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఈ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారు. పెళ్లి చేసుకునే ప్రతి మహిళకు ప్రభుత్వం తరఫున 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు పట్టు చీర బహుమతిగా అందించే కొత్త పథకాన్ని ఈ బడ్జెట్ లో ప్రకటించారు. ఇందుకు దాదాపు రూ.812 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకాన్ని కూడా ప్రకటించారు. ఈ పథకానికి థాయ్ మమ్మన్ తంగ మోధిర తిట్టం అని పేరు పెట్టారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ.560 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో మేరీ విల్సన్ తెలిపారు. శిశు సంక్షేమం, మాతృత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు.

Advertisement

అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా కీలక పథకాలను కొనసాగించారు. కళాశాల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే వెట్రి మడికనిని తిట్టం పథకాన్ని కొనసాగించారు. ఇందుకోసం రూ.2,000 కోట్లు కేటాయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, బాటిల్ హోల్డర్లు అందించే జెన్-జెడ్ పథకం కోసం రూ.777 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కామరాజ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ పరిధిని కూడా విస్తరించారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నారు.

Advertisement

ఈ పథకం సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా కొత్తగా 15.14 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కోసం రూ.710 కోట్లు కేటాయించారు. వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12 జిల్లాల్లో 12 ఆధునిక వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రతి కేంద్రంలో 40 మంది వృద్ధులకు వసతి, వైద్య సేవలు ఉంటాయని చెప్పారు. ఈ పథకం కోసం రూ.6.66 కోట్లు కేటాయించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.