భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలు, చిన్న పట్టణాల (టైర్-2 నగరాలు) మధ్య దశాబ్దాలుగా ఉన్న వేతన వ్యత్యాసం ప్రస్తుతం వేగంగా మారిపోతోంది. ప్రముఖ గ్లోబల్ నియామక సంస్థ టీమ్లీజ్ వెలువరించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగాలు, జీతాల ప్రైమర్ నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో చిన్న నగరాలు మెట్రో నగరాల కంటే మెరుగైన జీతాల పెంపు శాతాన్ని నమోదు చేయనున్నాయి. భారతదేశంలో కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా.. తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధి, పారిశ్రామిక కారిడార్ల విస్తరణ, భారీ మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల ఈ చిన్న నగరాలు కొత్త తరం ప్రధాన ఉద్యోగ కేంద్రాలుగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మెట్రో నగరాల జాబితాలో చెన్నై 9.7 శాతం అత్యధిక సగటు జీతాల పెంపుతో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాతి స్థానాల్లో పుణె, హైదరాబాద్ నగరాలు నిలిచాయి. భారతదేశపు టెక్ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరు 9.4 శాతం పెంపుతో నాలుగో స్థానానికి పరిమితమవ్వగా.. ముంబై, ఢిల్లీ నగరాలు 9.3 శాతం వృద్ధి అంచనాతో ఐదో స్థానంలో నిలిచాయి.
అయితే, మెట్రోయేతర నగరాలు (Non-Metro Cities) ఈ విషయంలో పెద్ద నగరాలకు గట్టి పోటీనిస్తున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం 9.5 శాతం జీతాల పెంపుతో బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ఆర్థిక కేంద్రాలను స్పష్టంగా అధిగమించింది. అలాగే రాజస్థాన్లోని జైపూర్ 9.3 శాతం పెంపుతో మెట్రోలకు సరిసమానంగా నిలవగా.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (వైజాగ్), మహారాష్ట్రలోని నాగ్పూర్ కూడా అద్భుతమైన వేతన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. తయారీ రంగానికి ఇచ్చిన ఊపు, స్థానిక మౌలిక సదుపాయాల కల్పన చిన్న నగరాలను పాత ఆర్థిక కేంద్రాలకు, కొత్త ఉద్యోగ మార్కెట్కు మధ్య బలమైన వారధిగా మారుస్తున్నాయని టీమ్లీజ్ పేర్కొంది.
ఎస్బిఐ మేనేజర్ రూ. 35 లక్షల వార్షిక జీతంపై హాట్ డిబేట్.. చేతికి అందే మొత్తంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
సగటు జీతాల పెంపు శాతాల్లో టైర్-2 నగరాలు సంచలనం సృష్టిస్తున్నప్పటికీ.. వాస్తవ సగటు వేతనాల (Actual Compensation Levels) విషయంలో అంతర్జాతీయ కంపెనీలకు నిలయమైన ప్రధాన ఐటీ టెక్ హబ్లే ఇప్పటికీ మార్కెట్పై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులకు ఉన్న నిరంతర డిమాండ్ కారణంగా బెంగళూరులో అత్యధికంగా 12.7 శాతం వాస్తవ వేతన వృద్ధి నమోదు కాగా.. హైదరాబాద్లో 11.7 శాతం, చెన్నై, పుణె నగరాల్లో 11.5 శాతం చొప్పున నమోదు కావడం విశేషం.
ఈ నివేదిక వివిధ పరిశ్రమలలో శాశ్వత, తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను కూడా బహిర్గతం చేసింది. ప్రయాణ, ఆతిథ్య రంగంలో శాశ్వత, తాత్కాలిక సిబ్బంది మధ్య వేతన వ్యత్యాసం కేవలం 4.2 శాతంతో అత్యల్పంగా ఉంది. విద్యుత్ & ఇంధన రంగంలో ఇది 4.3 శాతంగా.. ఫిన్టెక్ రంగంలో 4.8 శాతంగా నమోదైంది. దీనికి విరుద్ధంగా, తయారీ, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల (Manufacturing & Infrastructure) రంగంలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల మధ్య 11.4 శాతం మేర భారీ వేతన వ్యత్యాసం కొనసాగుతోంది. అలాగే బీమా (Insurance) రంగంలో 9.9 శాతం.. బ్యాంకింగ్ రంగంలో 9.8 శాతం వ్యత్యాసం ఉన్నట్లు నివేదిక వివరంగా వివరించింది.
More Articles
- EPFO: పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకుంటున్నారా అయితే లక్షల్లో నష్టపోతారు..!
- రూ. లక్షా డెబ్భై వేలు జీతం.. నెలాఖరుకి జీరో బ్యాలన్స్.. భార్య కూడా ఉద్యోగం చేయాలంటున్న టెకీ..
- ఎస్బిఐ మేనేజర్ రూ. 35 లక్షల వార్షిక జీతంపై హాట్ డిబేట్.. చేతికి అందే మొత్తంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
- Puneet Chhatwal: సంవత్సరానికి రూ. 25 కోట్ల జీతం తీసుకుంటున్న పునీత్ ఛత్వాల్..!
- EPFO: గుడ్ న్యూస్.. పీఎఫ్ కటింగ్ రూ.1800 లకే పరిమితం.. జీతం పెరుగుతుందా..!
- EPFO 3.0: పీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును ఒకేసారి ఎలా విత్డ్రా చేసుకోవచ్చు?