మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితుల నడుమ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన రాబోయే ఆగస్టు ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

ఆగస్టు 3 నుండి 5 తేదీల వరకు జరగనున్న సమీక్షా సమావేశంలో బెంచ్‌మార్క్ రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్దే యథాతథంగా ఉంచవచ్చని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన తాజా పోల్ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతిని, ద్రవ్యోల్బణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న ఆర్‌బిఐ.. వడ్డీ రేట్లను పెంచకుండా సుదీర్ఘకాలం పాటు ఇదే స్థిరత్వానికి మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

రాయిటర్స్.. జూలై 21 నుండి జూలై 27 మధ్యకాలంలో 72 మంది ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విశ్లేషకులలో ఏకంగా 95 శాతం మంది, అంటే 68 మంది ఆర్థికవేత్తలు ఆర్‌బిఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయదని ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేవలం నలుగురు నిపుణులు మాత్రమే 25 బేసిస్ పాయింట్ల (0.25%) స్వల్ప పెంపు ఉండవచ్చని అంచనా వేశారు. గత డిసెంబర్‌లో రెపో రేటును 5.25 శాతానికి చేర్చిన ఆర్‌బిఐ.. అప్పటి నుండి అదే వైఖరిని కొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే డిసెంబర్ నాటికి లేదా 2027 ఆరంభం వరకు కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.38 శాతానికి పెరిగినప్పటికీ.. ప్రస్తుత దశలో రుణ వ్యయాలను పెంచే ఆలోచన అకాలమని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యానించడంతో రేట్ల పెంపు సంకేతాలకు తెరపడింది. సర్వే అంచనాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్‌బిఐ మునుపటి అంచనా అయిన 5.1 శాతం కంటే తక్కువగా ఉండటంతో.. కేవలం ద్రవ్యోల్బణ భయాలతో రేట్లను పెంచాల్సిన తక్షణ ఆవశ్యకత ఆర్‌బిఐకి కనిపించడం లేదు.

బలంగా పుంజుకున్న రూపాయి.. గత రెండు వారాల్లోనే అత్యంత గరిష్ట స్థాయికి భారత కరెన్సీ..
Advertisement

ప్రస్తుత తరుణంలో తక్షణ వడ్డీ రేట్ల పెంపు కంటే దేశీయ ఆర్థిక వృద్ధికి ఉన్న నష్టాలే ఎక్కువని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అమెరికా విధిస్తున్న సుంకాల ప్రభావం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో వచ్చే వ్యత్యాసాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు భారత మార్కెట్లపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. తొందరపడి వడ్డీ రేట్లను పెంచడం వల్ల స్థానిక వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయని ఎస్‌టిసిఐ ప్రైమరీ డీలర్ ముఖ్య ఆర్థికవేత్త ఆదిత్య వ్యాస్ పేర్కొన్నారు. ఒకవేళ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లకు పైబడి సుదీర్ఘకాలం ఉంటే తప్ప ఆర్‌బిఐ తన వైఖరిని మార్చుకోకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

ఇక కరెన్సీ విషయానికి వస్తే.. ఈ ఏడాది అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 7 శాతం మేర క్షీణించినప్పటికీ.. రూపాయికి మద్దతుగా వడ్డీ రేట్ల సాధనాన్ని ఆర్‌బిఐ ఉపయోగించే సూచనలు లేవు. ముత్తూట్ ఫిన్‌కార్ప్ ముఖ్య ఆర్థికవేత్త అపూర్వ జవదేకర్ విశ్లేషణ ప్రకారం.. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించనంత వరకు, రూపాయి రక్షణ కోసం వడ్డీ రేట్లను పెంచి ఆర్థిక వృద్ధిని పణంగా పెట్టే సాహసాన్ని ఆర్‌బిఐ చేయదు. ఫలితంగా గృహ, వాహన రుణాల ఈఎంఐల భారం పెరగకుండా, రుణగ్రహీతలకు ప్రస్తుత రేట్లతోనే స్థిరమైన వాతావరణం లభించనుంది.