కర్ణాటక ప్రభుత్వం జూలై 15న విడుదల చేసిన సరికొత్త అపార్ట్‌మెంట్ ముసాయిదా చట్టం.. గృహ కొనుగోలుదారుల హక్కులను రక్షించడంతో పాటు నివాస సముదాయాల నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న లోపాలను సవరించే దిశగా సరికొత్త అడుగులు వేసింది.

Advertisement

ఈ ప్రతిపాదిత కర్ణాటక అపార్ట్‌మెంట్ (యాజమాన్యం మరియు నిర్వహణ) బిల్లు, 2026 యాభై ఏళ్ల నాటి పాత చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి రానుంది. ప్రస్తుత రియల్ ఎస్టేట్ నిబంధనలకు (RERA) అనుగుణంగా రూపొందించిన ఈ బిల్లు.. ముఖ్యంగా యాజమాన్య హక్కుల బదిలీ, పాత భవనాల పునరాభివృద్ధి, భద్రతా ప్రమాణాలు, బిల్డర్ల జవాబుదారీతనంపై స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది.

Advertisement

ఈ నూతన చట్టం ప్రధాన ఉద్దేశం కొనుగోలుదారులకు పూర్తి చట్టపరమైన యాజమాన్య హక్కులను కల్పించడమేనని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విక్రయ ఒప్పందం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే బిల్డర్లు సంబంధిత ఒరిజినల్ పత్రాలన్నింటినీ అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది.

నివాసితులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించే అంతిమ సమయం వరకు డెవలపర్లు ఖర్చు చేయని నిర్వహణ నిధులను బదిలీ చేయడం.. సంఘాల ఏర్పాటుకు సహకరించడం, ఉమ్మడి ప్రాంతాలను సక్రమంగా నిర్వహించడం వంటి పనులను బాధ్యతగా చేపట్టాలి. భూమి బదిలీ ప్రక్రియలో అపార్ట్‌మెంట్ యజమానులకు ఉమ్మడి ప్రాంతాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ.. నివాస సంక్షేమ సంఘాలను కేవలం పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలకే పరిమితం చేశారు. అలాగే ఉమ్మడి ప్రాంతాలు చట్టబద్ధంగా యజమానులకు బదిలీ చేయబడని పాత ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించడానికి ఇందులో డీమ్డ్ కన్వేయన్స్ నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు.

Advertisement
బెంగళూరులో ఖాళీ స్థలాల యజమానులకు BBMP బిగ్ షాక్.. 30 రోజుల్లో ప్లాట్లు శుభ్రం చేయకపోతే భారీ జరిమానా..

పాతబడిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల పునరాభివృద్ధి (Redevelopment) ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ బిల్లులో కనీసం 75 శాతం మంది యజమానుల సమ్మతిని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టులో పాల్గొనడానికి ఇష్టపడని మైనారిటీ యజమానుల ప్రయోజనాలను కాపాడుతూ.. వారి ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువకు కనీసం రెట్టింపు (2 రెట్లు) పరిహారంగా చెల్లించాలని నిర్దేశించారు.

భవనాల భద్రతను పెంపొందించేందుకు 30 సంవత్సరాల కంటే పాతబడిన నివాస సముదాయాలు తప్పనిసరిగా నిర్మాణ స్థిరత్వ ధృవీకరణ పత్రాలను (Structural Stability Certificates) పొందాలని.. ఆపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ తనిఖీలను పునరావృతం చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వచ్చే పెద్ద మరమ్మతులు, పునరాభివృద్ధి అవసరాల కోసం ఒక ఉమ్మడి మూలధన నిధిని (Capital Fund) కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వివాదాల వేగవంతమైన పరిష్కారం కోసం ఏర్పాటు చేసే సమర్థ అధికార సంస్థలకు సివిల్ కోర్టులతో సమానమైన అధికారాలు కల్పిస్తూ.. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటి పర్యవేక్షణను ఉంచారు.

Advertisement

కొంతమంది బిల్డర్లు కొనుగోలుదారుల ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారని, ఆ అప్పులు తీరేవరకు అసలు టైటిల్ పత్రాలను యజమానులకు ఇవ్వకుండా వేధిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి డీకే తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పద్ధతులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. పత్రాల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా, అధికారికంగా నమోదు కావాలని డెవలపర్లను హెచ్చరించారు.

ఈ ముసాయిదా బిల్లును చట్టంగా మార్చే ముందు అపార్ట్‌మెంట్ యజమానుల నుండి సలహాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ఆగస్టు 6 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాత వచ్చే సూచనలను క్రోడీకరించి ముసాయిదాను క్యాబినెట్ ఆమోదం కోసం పంపి, రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.