ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ నుండి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు జింద్ నుండి సోనిపత్ వరకు 89 కిలోమీటర్ల దూరం తన తొలి సర్వీసును నడుపుతుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అయినప్పటికీ,..ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్కు పోటీ కాదు. ఎందుకంటే ఈ రెండు రైళ్లను పూర్తిగా భిన్నమైన ప్రయాణ అవసరాలను తీర్చడం కోసం,..వేర్వేరు సాంకేతికతలతో రూపొందించారు.భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు, వందే భారత్ రైళ్లకు మధ్య ఉన్న ఏడు ప్రధాన వ్యత్యాసాలు క్రింది విధంగా ఉన్నాయి.
హైడ్రోజన్ రైలు అనేది ఆధునీకరించిన డీఈఎంయూ (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది. ఇది తనంతట తానుగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. దీనిలోని ఫ్యూయల్ సెల్ లోపల హైడ్రోజన్, ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉప ఉత్పత్తిగా పర్యావరణంలోకి విడుదలవుతుంది. అయితే వందే భారత్ 25kV ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ లైన్ల నుండి నిరంతరాయంగా విద్యుత్ను తీసుకునే పూర్తి ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ సాంకేతికతతో పనిచేస్తుంది.
వేగంలో వందే భారత్ రైళ్లు చాలా ముందంజలో ఉన్నాయి. వీటి ప్రామాణిక రేక్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి, కాగా వందే భారత్ 2.0, స్లీపర్ వేరియంట్లకు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అనుమతి లభించింది. మరోవైపు హైడ్రోజన్ రైలు సాధారణ కార్యాచరణ వేగం గంటకు 75 కిలోమీటర్లుగా మాత్రమే నిర్దేశించబడింది. అయితే ట్రయల్స్ (పరీక్షలు) నిర్వహించిన సమయంలో ఈ హైడ్రోజన్ రైలు గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడం విశేషం.
10 కోచ్లతో రూపొందించిన హైడ్రోజన్ రైలులో 682 మంది ప్రయాణీకులు కూర్చోవచ్చు. కాగా దీని మొత్తం నిలబడే సామర్థ్యంతో కలిపి సుమారు 2,600 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది తక్కువ దూర ప్రయాణాల కోసం డీఈఎంయూ (DEMU) తరహా లేఅవుట్ను కలిగి ఉంటుంది. కానీ సాధారణ 16 కోచ్ల వందే భారత్ రైలులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో కలిపి దాదాపు 1,128 మంది కూర్చోవడానికి వీలుంటుంది. వందే భారత్లో పూర్తిస్థాయి సీటింగ్, ఏసీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్: ముంబై ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్!
రద్దీగా ఉండే ఇప్పటికే 100 శాతం విద్యుదీకరించబడిన ప్రధాన నగరాల మార్గాలలో పాతబడిన శతాబ్ది రాజధాని ఎక్స్ప్రెస్ సర్వీసుల స్థానంలో వందే భారత్ను ప్రవేశపెట్టారు. దీనికి భిన్నంగా, హైడ్రోజన్ రైలును వారసత్వ (హెరిటేజ్) కొండ ప్రాంతాల వంటి.. ఇంకా విద్యుదీకరణ జరగని లేదా విద్యుత్ వైరింగ్ చేయడానికి భౌగోళికంగా చాలా ఖరీదైన చిన్న రైలు మార్గాలను డీకార్బనైజ్ (కర్బన ఉద్గార రహితం) చేయడానికి ఉద్దేశించారు. ప్రస్తుతం భారతదేశంలోని 99 శాతం పైగా బ్రాడ్-గేజ్ నెట్వర్క్ ఇప్పటికే విద్యుదీకరించబడినందున.. మిగిలిన ప్రత్యేక రూట్లలో ఈ హైడ్రోజన్ రైళ్లు ప్రత్యేక పాత్రను పోషించనున్నాయి.
వందే భారత్ రైలులో దేశీయ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ 'కవచ్', రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. అయితే హైడ్రోజన్ వాయువు అత్యంత మండే స్వభావం కలది కావడం వల్ల, హైడ్రోజన్ రైలులో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో నిరంతర లీక్ గుర్తింపు, మంట, పొగను పసిగట్టే సెన్సార్లు, ఆటోమేటిక్ షట్-ఆఫ్ సిస్టమ్, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ఉండే లోకో పైలట్ క్యాబిన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. పైగా మొదటి మూడు నెలల పాటు శిక్షణ పొందిన హైడ్రోజన్-సిస్టమ్స్ నిపుణులు ఈ రైలుతో పాటు ప్రయాణిస్తారు.
ప్రస్తుత జింద్-సోనిపత్ హైడ్రోజన్ రైలు పైలట్ ప్రాజెక్ట్కు (రెట్రోఫిట్, ఇంధనం నింపే మౌలిక సదుపాయాలతో కలిపి) రూ. 111.83 కోట్లతో ఆమోదం లభించింది. భారత రైల్వేస్ చేపట్టిన 'హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్' ప్రణాళిక కింద సుమారు రూ. 80 కోట్ల చొప్పున మొత్తం 35 రైళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పోలిస్తే.. వందే భారత్ యొక్క అసలు 2019 నాటి రేక్ తయారీకి (హైడ్రోజన్ ప్లాంట్ల అదనపు ఖర్చులను మినహాయించి) సుమారు రూ. 97 కోట్లు ఖర్చయింది.
వందే భారత్ యొక్క భవిష్యత్తు విస్తరణ చాలా స్పష్టంగా ఉంది. మరిన్ని కొత్త మార్గాలు, వేగవంతమైన బోగీలు, రాత్రి ప్రయాణాల కోసం స్లీపర్ వేరియంట్లను తీసుకురావడంపై రైల్వే దృష్టి పెట్టింది. కానీ, హైడ్రోజన్ రైలు భవిష్యత్తు మరింత ప్రయోగాత్మకంగా సాగనుంది. జింద్-సోనిపత్ పైలట్ ప్రాజెక్ట్ తొలి కొన్ని నెలల సేవ నుండి వచ్చే సాంకేతిక డేటా ఆధారంగా దీనిని విస్తృతంగా అమలు చేస్తారు. ఈ క్రమంలో.. కల్కా-సిమ్లా హెరిటేజ్ లైన్ను తదుపరి హైడ్రోజన్ రైలు గమ్యస్థానంగా ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే సూచించింది.
More Articles
- ప్రయాణికులా లేక దొంగలా.. రైల్వేల్లో 1.27 కోట్ల బెడ్షీట్లు మాయం.. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే..
- Train Ticket Booking: రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైనా రైలు బయల్దేరే 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- రైలు కాదిది.. పట్టాలపై నడిచే లగ్జరీ హోటల్! వందే భారత్ స్లీపర్ ఫస్ట్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్!
- రద్దైన టికెట్పై రూ. 5 తక్కువ రీఫండ్.. ప్రయాణికుడికి రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..
- వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే AI.. ఇండియన్ రైల్వేస్ సూపర్ అప్డేట్!
- తత్కాల్ టికెట్ బుకింగ్లో సరికొత్త రూల్.. ఇకపై లైన్లలో గంటల కొద్దీ నిలబడాల్సిన పనిలేదు!