పర్యావరణ రక్షణ దిశగా భారతీయ రైల్వే చారిత్రాత్మక ముందడుగు వేసింది, ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును హర్యానాలోని జింద్, సోనిపత్ మార్గంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ రైలులో ఛార్జీలు కూడా చాలా తక్కువే. ప్రయాణికులకు జింద్ నుండి సోనిపత్ వరకు కనీస ఛార్జీ రూ. 5 కాగా, గరిష్ట ఛార్జీ రూ. 25 మాత్రమే కావడం విశేషం. వందే భారత్, అమృత్ భారత్ తరహాలోనే ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ రైలు, సాంప్రదాయ డీజిల్ రైళ్లలాగా కాలుష్యాన్ని వెదజల్లకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే ఉద్గారంగా విడుదల చేస్తుంది.

Advertisement

అయితే అత్యంత చౌకైన ఛార్జీలు, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ.. ప్రారంభ రోజుల్లో ఈ రైలులో ప్రయాణికుల సంఖ్య అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు. మొదటి రోజు జింద్ జంక్షన్ నుండి సుమారు 20 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగా.. రెండవ రోజు కూడా దాదాపు అదే తరహా స్పందన లభించింది.

Advertisement

ఈ తక్కువ ఆక్యుపెన్సీకి ప్రధాన కారణం జింద్-సోనిపత్ మార్గంలో ఇప్పటికే అనేక ఇతర ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండడమేనని చెప్పవచ్చు. కొత్త రైలు సమయాలు, దాని ప్రత్యేకతలు, ప్రయాణ ప్రయోజనాలపై ప్రయాణికులకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన కలుగకపోవడం కూడా ఈ ప్రారంభ నిరాశకు దోహదం చేసింది. సమయం గడిచేకొద్దీ, విస్తృత ప్రచారం లభించే కొద్దీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

సాంకేతికంగా ఈ హైడ్రోజన్ రైలు అత్యాధునిక ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ కలయిక ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రైలు మోటార్లను నడుపుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలను అమర్చారు. మొత్తం 10 కోచ్‌లు కలిగిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Advertisement
హైడ్రోజన్ రైలు vs వందే భారత్.. ఏది వేగం..మరేది చౌక.. ప్రయాణికులు తెలుసుకోవాల్సినవి ఇవే..

భారతీయ రైల్వే చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 111.83 కోట్లు వెచ్చించారు. జింద్ నుండి సోనిపత్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కవర్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ కోచ్‌లను తమిళనాడులోని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేసి తయారు చేశారు. ఇందులో ఉపయోగించిన ఫ్యూయల్ సెల్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా భారతీయ వాతావరణం, ఉష్ణోగ్రతలకు అనుగుణంగా రూపొందించారు.

రైలుకు అవసరమైన ఇంధనం కోసం జింద్ వద్ద ప్రత్యేకంగా ఒక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ నీటి నుండి హైడ్రోజన్‌ను వేరు చేసి, కంప్రెస్డ్ రూపంలో రైలులోని సిలిండర్లలోకి నింపుతారు. ఒకసారి ఇంధనం నింపితే ఈ రైలు సుమారు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు.ఒక సాధారణ డీజిల్ రైలు ఏడాదికి వందల టన్నుల కార్బన్ ఉద్గారాలను (CO2) విడుదల చేస్తుంది. అయితే ఈ హైడ్రోజన్ రైలు ద్వారా సంవత్సరానికి సుమారు 1,200 టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించవచ్చని రైల్వే శాఖ అంచనా వేసింది.

Advertisement

జింద్-సోనిపత్ మార్గంలో అందుతున్న ఫలితాలు.. ప్రయాణికుల స్పందన ఆధారంగా రాబోయే రోజుల్లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా వంటి పర్యాటక, కొండ ప్రాంతాలలో కూడా మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక ప్రయాణికులకు ఈ కొత్త వేళలపై అవగాహన కల్పించేందుకు.. రైల్వే స్టేషన్లలో డిజిటల్ బోర్డుల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత, ట్రాక్ నిర్వహణ, ఆధునీకరణ పనుల్లో భాగంగా ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. జూలై 27 నుండి జూలై 29 వరకు పలు మార్గాల్లో నడిచే అనేక రైళ్లను రద్దు చేయడంతో పాటు.. కొన్ని ప్రధాన రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు (Diverted) తెలిపింది. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు రైల్వే అధికారిక యాప్ లేదా స్టేషన్ ఎంక్వైరీ కౌంటర్లలో రద్దయిన, మళ్లించిన రైళ్ల జాబితాను ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించింది.