అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వద్ద ఉన్న పసిడి నిల్వలను మెల్లిగా పెంచుకుంటోంది. 2026 జూన్ 26 నాటికి ఆర్‌బిఐ వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల Gold నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అధికారికంగా వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత మూడేళ్ల కాలంలో దేశీయ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భాగమైన పసిడి పరిమాణంలో వచ్చిన వ్యూహాత్మక మార్పులను వివరంగా సభ ముందుకు తీసుకువచ్చారు.

Advertisement

ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ వద్ద 794.63 మెట్రిక్ టన్నుల బంగారం ఉండగా.. 2024 మార్చి 31 నాటికి అది మరో 27.47 టన్నులు పెరిగి 822.10 టన్నులకు చేరింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ మరింత స్థాయిలో Gold కొనుగోళ్లు జరిపింది. 2025 మార్చి 31 నాటికి ఏకంగా 57.48 టన్నుల భారీ పెరుగుదలతో మొత్తం నిల్వలు 879.58 టన్నుల మైలురాయిని చేరుకున్నాయి. గత మూడేళ్ల కాలవ్యవధిలో ఒకే సంవత్సరంలో పసిడి నిల్వల్లో నమోదైన అతిపెద్ద వార్షిక వృద్ధి ఇదే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక 2026 మార్చి 31 నాటికి ఈ నిల్వలు స్వల్పంగా 0.94 టన్నులు పెరిగి 880.52 టన్నులకు చేరగా.. జూన్ చివరి నాటికి కూడా అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి.

Advertisement

కేంద్ర బ్యాంకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న ఈ బంగారు నిల్వల మొత్తం విలువ సుమారు రూ. 9.79 లక్షల కోట్లుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో ధరలలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా ఇది మునుపటి వారంతో పోలిస్తే రూ. 23,000 కోట్లు తగ్గినప్పటికీ.. ఓవరాల్‌గా విదేశీ మారక నిల్వల్లో పసిడి ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ నికర విదేశీ ఆస్తులలో (NFA) బంగారం వాటా గత రెండేళ్ల కాలంలో ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. మార్చి 2024 నాటికి కేవలం 8.3 శాతంగా ఉన్న పసిడి వాటా.. అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, విస్తృత కొనుగోళ్ల కారణంగా మార్చి 2026 ముగింపు నాటికి సుమారు 17 శాతానికి ఎగబాకింది.

Advertisement
బంగారం ధరలు కుప్పకూలే సమయం వచ్చేసింది.. ఇప్పుడు పసిడి కొనుగోలుపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక సూచన..

ఇదిలా ఉండగా భారతీయ కుటుంబాలు, ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాల వద్ద అపరిమితంగా భావించే పసిడి నిల్వలు ఎంత పరిమాణంలో ఉన్నాయనే విషయమై కూడా పార్లమెంట్‌లో ప్రశ్న ఎదురైంది. దీనికి కేంద్రం స్పందిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ గానీ, ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) గానీ లేదా గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) గానీ దేశంలోని గృహాలు లేదా దేవాలయాల వద్ద ఉన్న బంగారం పరిమాణంపై ఎలాంటి అధికారిక అధ్యయనం లేదా సర్వే నిర్వహించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

మొత్తానికి చైసినట్లయితే అమెరికన్ డాలర్ స్థిరత్వంపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. దేశీయ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంగా పసిడి నిల్వలను బలోపేతం చేసే దిశగా ఆర్‌బిఐ వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో.. భారత్ తన రిజర్వులలో పసిడి వాటాను 17 శాతానికి పెంచుకోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థ భద్రతకు మైలురాయిగా నిలుస్తుంది.