Pensions: పాత, కొత్త పింఛను విధానాలపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) పేరిట మోడీ సర్కారు నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పద్ధతిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఓల్డ్ పెన్షన్ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ సందర్భంగా పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. వాటిని పార్లమెంటులో నిన్న వివరించింది.
పాత vs కొత్త పెన్షన్ సిస్టమ్స్:
ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. పాత, కొత్త పింఛను విధానాలను ఈ ప్యానెల్ మళ్లీ పరిశీలించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల అవసరాలు మరియు ఆర్థిక ఖర్చుల మధ్య సమతుల్యతను సాధించే విధానంపై కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే మార్పులను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు.
OPS వైపు BJP యేతర రాష్ట్రాల అడుగులు:
తాజాగా బీజేపీ యేతర పాలనలోని 5 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో కమిటీ ఏర్పాటు నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెబుతున్నారు. 64 సవరణలతో ఆమోదించబడిన ఆర్థిక బిల్లు, 2023 పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు.
OPS అనుసరిస్తున్న రాష్ట్రాలివే..
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లు.. అధిక ప్రయోజనాలను అందించే పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి తిరిగి మళ్లాయి. మహారాష్ట్రలోని బిజెపి -సేన (షిండే వర్గం) ప్రభుత్వం కూడా NPS కింద ఉన్నవారికి OPS బెనిఫిట్స్ ను విస్తరించడానికి ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.