ఏడు దశాబ్దాల సుదీర్ఘ పౌర విమానయాన ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ.. విశాఖపట్నం ఐఎన్ఎస్ దేగా సివిల్ ఎన్‌క్లేవ్‌లో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన కార్యకలాపాలు ఆగస్టు 17తో అధికారికంగా ముగియనున్నాయి. అదే రోజు నుండి వ్యాపార, వాణిజ్య, ప్రయాణీకుల విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లా భోగపురంలో నూతనంగా నిర్మించిన ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రారంభం కానున్నాయి. ప్రఖ్యాత గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గౌరవార్థం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అని నామకరణం చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది.

Advertisement

ఆగస్టు 17న తెల్లవారుజామున 12.01 గంటల నుండి భోగపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరగనుంది. 2016 జనవరి 27న భోగపురం ప్రాజెక్ట్‌కు స్థల అనుమతులు మంజూరు చేసేటప్పుడు విధించిన ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా, కొత్త విమానాశ్రయం ప్రారంభమైన నాటి నుండి తదుపరి 30 సంవత్సరాల పాటు పాత విశాఖపట్నం సివిల్ ఎన్‌క్లేవ్‌లో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన రాకపోకలు పూర్తిగా మూసివేయబడతాయి. దశాబ్దాలుగా అంతర్జాతీయ విమానయాన నెట్‌వర్క్‌లలో వైజాగ్ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న VTZ ఐఏటీఏ (IATA) కోడ్‌ను కూడా అధికారికంగా భోగపురం విమానాశ్రయానికే బదిలీ చేశారు.

Advertisement

అయితే పాత విశాఖ విమానాశ్రయ మూసివేత కేవలం సాధారణ షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలకు మాత్రమే పరిమితం కానుంది. తూర్పు నావికాదళ కమాండ్ ప్రధాన కార్యాలయంగా విశాఖపట్నానికి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా.. ఈ ఎయిర్‌బేస్ సైనిక అవసరాల కోసం పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. సాయుధ దళాలు, రక్షణ విభాగాలు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు నడిపే విమానాలతో పాటు జాతీయ అత్యవసర పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండే వీఐపీ (VIP) విమానాల రాకపోకలకు ఈ నియమాల నుండి ప్రత్యేక మినహాయింపు కల్పించారు. అంతేకాకుండా, సాధారణ షెడ్యూల్ చేయని చార్టర్డ్, వాణిజ్యేతర విమానాలు ఈ ఎన్‌క్లేవ్ నుండి నడపడానికి అనుమతి ఉంటుంది.

Advertisement
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే.. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతులు మీదుగా ప్రారంభం..

విశాఖపట్నం ఒక సాధారణ ఓడరేవు పట్టణం నుండి దేశంలోనే ప్రధాన తీరప్రాంత పారిశ్రామిక నగరంగా రూపాంతరం చెందడంలో ఐఎన్ఎస్ దేగా విమానాశ్రయం వహించిన పాత్ర మరచిపోలేనిది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సైనిక విమానాశ్రయంగా ప్రారంభమై.. 1954లో పౌర విమాన సేవలకు తలుపులు తెరిచింది. రక్షణ, పౌర విమానయాన రంగాలు రెండూ ఒకే చోట కలిసి పనిచేసిన అరుదైన కేంద్రంగా నిలిచింది. 1970లలో జెట్ విమానాల విస్తరణ, 1990లలో మౌలిక వసతుల కల్పన, 2000ల చివర్లో నూతన సమీకృత టెర్మినల్ నిర్మాణం ద్వారా ఇది శీఘ్రంగా అభివృద్ధి చెందింది. 2010లో అంతర్జాతీయ హోదా సాధించిన తర్వాత మధ్యప్రాచ్యం.. ఆగ్నేయాసియా దేశాలకు నేరుగా కనెక్టివిటీ సాధిస్తూ, ఏటా పది లక్షల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందించింది.

Advertisement

నగరంలో పారిశ్రామిక, ఫార్మా, ఐటీ రంగాలు విస్తరించిన తరుణంలో ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా (కార్గో) అవసరాలు గణనీయంగా పెరిగాయి. పాత విమానాశ్రయం స్థల పరిమితుల దృష్ట్యా విస్తరణకు వీలులేకపోవడంతో భోగపురం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఎస్ఆర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. విశాఖ పాత విమానాశ్రయం తన చారిత్రాత్మక పౌర సేవలకు ముగింపు పలుకుతుండగా.. భోగపురంలోని కొత్త విమానాశ్రయం రాబోయే దశాబ్దాలలో ఉత్తరాంధ్ర ఆర్థిక, ఆర్థిక సమిష్టి ప్రగతికి, పర్యాటక రంగానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి సరికొత్త దిక్సూచిలా మారడానికి రెడీ అవుతోంది.