భారతదేశంలోని ప్రధాన పట్టణ ప్రాంతాలలో నివసించే అద్దెదారులకు నెలవారీ అద్దె ఒక నిరంతర భారమైతే..కొత్త ఇంట్లోకి మారేముందు వారికి అతిపెద్ద ఆర్థిక అడ్డంకి ఏదైనా ఉందంటే అది సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. ఈ సెక్యూరిటీ డిపాజిట్ మీద తాజాగా బయటకు వచ్చిన నివేదిక అందరికీ షాక్ ఇస్తోంది. నోబ్రోకర్ రెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం.. దేశంలోని ఆరు అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని అద్దెదారులు తమ యజమానుల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో సుమారు రూ. 1.26 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఉంచారు.

Advertisement

ఎలాంటి వడ్డీ లేదా రాబడిని ఇవ్వని ఈ నిరుపయోగ మూలధన నిధి గృహాల ఆర్థిక ద్రవ్యతను తీవ్రంగా పరిమితం చేస్తోంది. ఈ సొమ్ము మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు వంటి ఉత్పాదక రంగాలలో పెట్టుబడిగా మారకుండా లేదా గృహ వినియోగానికి ఉపయోగపడకుండా వడ్డీ లేని డిపాజిట్లుగా యజమానుల వద్దే నిలిచిపోతోంది. ఈ భారీ మొత్తంలో సగానికి పైగా వాటా కేవలం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు మార్కెట్ల నుంచే ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అధిక అద్దె విలువల కారణంగా ముంబై రూ. 41,156 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అద్దెకు గుణకారంగా ముందుగానే భారీ డిపాజిట్లను డిమాండ్ చేసే దీర్ఘకాలిక పద్ధతి వల్ల బెంగళూరులో రూ. 31,628 కోట్లు చిక్కుకుపోయాయి.

Advertisement

ముఖ్యంగా బెంగళూరు అద్దె మార్కెట్ ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ వివాదాలకు పర్యాయపదంగా మారింది. ఇల్లు ఖాళీ చేసే సమయంలో డిపాజిట్ మొత్తాన్ని సకాలంలో వాపసు ఇవ్వకపోవడం లేదా రకరకాల కారణాలతో నిలిపివేయడంపై రెడ్డిట్, ఎక్స్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అద్దెదారులు తమ చేదు అనుభవాలను ప్రతీసారి పంచుకుంటున్నారు. తదుపరి అద్దెదారు కోసం ఇంటికి రంగులు వేయడం, సాధారణ అరుగుదల, చిన్నపాటి మరమ్మతులు, డీప్ క్లీనింగ్ పేరుతో యజమానులు అక్రమంగా కోతలు విధిస్తున్నారని అద్దెదారులు ఆరోపిస్తున్నారు.

బెంగళూరులో ఖాళీ స్థలాల యజమానులకు BBMP బిగ్ షాక్.. 30 రోజుల్లో ప్లాట్లు శుభ్రం చేయకపోతే భారీ జరిమానా..
Advertisement

ఈ నగరంలో కేవలం 35 శాతం మంది మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా తమ డిపాజిట్‌ను పూర్తిగా తిరిగి పొందగలుగుతున్నారు. మిగిలిన వారిలో 40 శాతం మంది కోతలను ఎదుర్కొంటుండగా.. 18 శాతం మంది తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మరో 7 శాతం మందికి అసలు డిపాజిట్ మొత్తమే తిరిగి రావడం లేదు. దీనికి భిన్నంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది, అక్కడ 58 శాతం మంది అద్దెదారులు తమ డిపాజిట్‌ను పూర్తిగా వెనక్కి పొందుతున్నారు.

ఈ ఆర్థిక భారం బెంగళూరులోని 75 శాతం మంది అద్దెదారులు తాము ఇష్టపడిన ఇంటిని కనీసం ఒక్కసారైనా వదులుకోవడానికి కారణమైంది. ముందస్తు భారాన్ని తగ్గించుకోవడానికి నగరంలోని ముప్పావు వంతు మంది అద్దెదారులు, డిపాజిట్ మొత్తాన్ని తగ్గిస్తే నెలవారీ అద్దెను 5 నుండి 10 శాతం ఎక్కువగా చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

Advertisement

మరోవైపు పట్టణ అద్దెదారుల నెలవారీ ఆదాయంలో గృహవసతి ఖర్చులు అత్యధిక వాటాను ఆక్రమిస్తున్నాయి. ఈ విషయంలో ముంబై దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడి ప్రతి పది మంది అద్దెదారులలో నలుగురు తమ సంపాదనలో 40 శాతం కంటే ఎక్కువ భాగాన్ని అద్దెకే కేటాయిస్తున్నారు, అందులోనూ 25 శాతం మంది తమ ఆదాయంలో సగానికి పైగా అద్దెకే ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సైతం 25 శాతం మంది తమ నెలవారీ సంపాదనలో 40 శాతానికి పైగా గృహవసతి కోసం ఖర్చు పెడుతున్నారు.

అయితే బెంగళూరులో నిపుణుల ఆదాయాలతో పోలిస్తే నెలవారీ అద్దె-ఆదాయ నిష్పత్తి సాపేక్షంగా మెరుగ్గా ఉంది. ఇక్కడ 46 శాతం మంది అద్దెదారులు తమ భరించదగిన 20-30 శాతం పరిధిలోనే అద్దెను చెల్లిస్తున్నారు. అయినప్పటికీ, నెలవారీ అద్దె కంటే ప్రారంభంలో చెల్లించాల్సిన అసాధారణమైన ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనలే బెంగళూరులో నిరంతర వివాదాలకు, అద్దెదారుల ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.