బెంగళూరు, చెన్నై నగరాల మధ్య ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథపరిటీ ఆఫ్ ఇండియా (NHAI) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ హై-స్పీడ్ కారిడార్‌లోని 71 కిలోమీటర్ల కర్ణాటక పరిధిలో టోల్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త టోల్ రేట్లు జూలై 22, 2026 నుండి అమలులోకి వచ్చాయని.. ఇవి మార్చి 31, 2027 వరకు వర్తిస్తాయని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ కేబీ జయకుమార్ అధికారికంగా వెల్లడించారు. గడిచిన ఐదు నెలల స్వల్ప వ్యవధిలోనే కర్ణాటకలోని ప్రధాన జాతీయ రహదారులపై టోల్ సవరణ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Advertisement

ఈ సవరించిన టారిఫ్ ప్రకారం హోస్కోట్ (హెడగినబెలె) నుండి కేజీఎఫ్-బెతమంగళ (సుందరపల్య) మధ్య ప్రయాణించే కార్లు, జీపులు, తేలికపాటి మోటారు వాహనాలకు (LMV) ఒకవైపు ప్రయాణానికి (వన్-వే) టోల్ రుసుము రూ. 150గా నిర్ణయించారు. అదే రోజు తిరుగు ప్రయాణం (రిటర్న్ జర్నీ) చేసే వారికి రూ. 225, అలాగే 50 ప్రయాణాలకు వర్తించే నెలవారీ పాస్ ధరను రూ. 4,955గా ఖరారు చేశారు.

Advertisement

ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, మినీ బస్సులకు వన్-వే టోల్ రూ. 240, రిటర్న్ జర్నీకి రూ. 360 చెల్లించాల్సి ఉంటుంది. భారీ వాహనాలైన బస్సులు, ట్రక్కులకు వన్-వే టోల్ రూ. 505 గానూ, రిటర్న్ జర్నీకి రూ. 755 గానూ నిర్ణయించారు. మల్టీ-యాక్సిల్ వాహనాలకు ఇరుసుల సంఖ్యను బట్టి రూ. 550 నుండి రూ. 960 వరకు టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

బెంగళూరులో బిగ్గెస్ట్ రెంట్ స్కాం.. అద్దెదారుల సెక్యూరిటీ డిపాజిట్లపై షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Advertisement

కర్ణాటకలోని ఈ 71 కిలోమీటర్ల కారిడార్‌లో హెడగినాబెలె (హోస్కోట్ సమీపంలో), అగ్రహార (మలూరు సమీపంలో), కేజీఎఫ్ (కృష్ణవరం బీఈఎంఎల్ నగర్ సమీపంలో), సుందరపల్య వద్ద మొత్తం నాలుగు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై అధిక వేగంతో ప్రయాణించే కార్లు, వ్యాన్లు, బస్సులు, ట్రక్కులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.

మొత్తం 262 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కర్ణాటకలోని 71 కిలోమీటర్ల భాగంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని బెతమంగళ నుండి బైరెడ్డిపల్లి వరకు ఉన్న 25 కిలోమీటర్ల మార్గం మాత్రమే వినియోగంలో ఉంది. తమిళనాడు పరిధిలోని నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ప్రస్తుతం హోస్కోట్ నుండి బైరెడ్డిపల్లి వరకు సుమారు 100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా ముగియక ముందే టోల్ వసూలు ప్రారంభించడంపై రవాణాదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ కారిడార్ పూర్తిగా పూర్తయితే ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతమై ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.