ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA).. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఆతిథ్య, విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గాను.. స్టార్-కేటగిరీ హోటళ్లు, ప్రైవేట్ పాఠశాలల స్థాపనకు ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ టెండర్లను జారీ చేసింది. ఈ కేటాయింపుల్లో భాగంగా అమరావతి చరిత్రలోనే ప్రభుత్వ భూములకు సరికొత్త రికార్డు ధరలను నిర్ణయించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
రాజధాని నగరానికి వస్తున్న దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు, విదేశీ కన్సల్టెంట్ల అవసరాల కోసం మూడు త్రీ-స్టార్, రెండు ఫోర్-స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. తుళ్ళూరు, రాయపూడి, వెంకటపాలెం ప్రాంతాలలో మొత్తం 9.19 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. అమరావతిలో ఇప్పటివరకు ప్రభుత్వ భూములకు లేనంతగా ఎకరానికి రూ. 8.20 కోట్ల రికార్డు ధరను నిర్ణయించి.. ఫ్రీహోల్డ్ ప్రాతిపదికన ఈ భూములను కేటాయించనున్నారు.
ఈ హోటళ్ల ఏర్పాటుకు డెవలపర్లు కనీసం రూ. 75 కోట్ల పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. ప్రతి హోటల్లో కనీసం 125 నుండి 175 గదులు ఉండాలని, అవి 5-స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా భవనంపై తప్పనిసరిగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని.. కన్వెన్షన్ హాళ్ల ద్వారా ఏడాదికి కనీసం 2,500 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక ఉండాలని నిబంధనలు విధించింది. అలాగే ప్రతి ఏడాది 15 రోజుల పాటు హోటల్ గదులను, ప్రభుత్వ సమావేశాల కొరకు బ్యాంకెట్ హాళ్లను కూడా సీఆర్డీఏ వినియోగానికి ఉచితంగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు.. బ్యాంకు గ్యారంటీ జప్తు వంటి చర్యలు ఉంటాయని టెండర్లలో స్పష్టం చేసింది.
అమరావతి vs మావిగన్.. ఏపీ ఎకానమీకి ఏది లాభం.. రియల్ ఎస్టేట్ నుంచి ఐటీ పెట్టుబడుల వరకు ప్రభావమెంత..
మరోవైపు రాజధాని ప్రాంతంలో నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు లోయర్ కిండర్ గార్టెన్ (LKG) నుండి 12వ తరగతి వరకు విద్యనందించే ఐదు ప్రైవేట్ పాఠశాలల స్థాపనకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. తుళ్లూరు, నవులూరు, పెనుమాక, కృష్ణాయపాలెం, దొండపాడు ప్రాంతాలలో మొత్తం 15.80 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ఈ పాఠశాలల కోసం ఎకరానికి రూ. 4.10 కోట్ల ధరను నిర్ణయించి.. 33 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూములను కేటాయించనున్నారు.
ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ పత్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. హోటల్ డెవలపర్ల కోసం జూలై 22న ప్రీ-ప్రపోజల్ సమావేశాన్ని నిర్వహించనుండగా, బిడ్లను సమర్పించడానికి జూలై 30ని ఆఖరి గడువుగా నిర్ణయించారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో.. సీఆర్డీఏ తీసుకున్న ఈ నిర్ణయం నగరాభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుంది.
More Articles
- Thalliki Vandanam: గుడ్ న్యూస్.. జూలై 22న బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు జమ..!
- అమరావతి vs మావిగన్.. ఏపీ ఎకానమీకి ఏది లాభం.. రియల్ ఎస్టేట్ నుంచి ఐటీ పెట్టుబడుల వరకు ప్రభావమెంత..
- అమరావతి రైతులకు పండగ: కౌలు పెంపు, రుణమాఫీతో భారీ ఊరట!
- అమరావతి, తిరుపతిపై చంద్రబాబు కీలక నిర్ణయం..ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు..
- అమరావతిలో మళ్లీ యుద్ధప్రాతిపదికన పనులు: 100 రోజుల్లోనే కీలక ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు డెడ్లైన్!
- ఆంధ్రప్రదేశ్కు బిగ్ బూస్ట్.. హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్.. తిరుపతి కీలక స్టేషన్గా ప్రతిపాదన..