రాయలసీమ ప్రాంతంలో దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరువు నివారణ, సాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా ఏకంగా రూ. 20,884 కోట్ల అంచనా వ్యయంతో వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల పనులను చేపడుతున్నారు. ఈ సమగ్ర వ్యూహం ద్వారా అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ లభ్యత పెరగడమే కాకుండా.. 4.37 లక్షల ఎకరాల్లో సాగునీటి స్థిరత్వం చేకూరుతుందని, మొత్తం 9.80 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

ఈ విస్తృత నీటిపారుదల ప్రణాళికలో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనదిగా నిలుస్తోంది. గత ఏడాది కాలంలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 3,880 కోట్లు వెచ్చించగా, కాలువల పునర్నిర్మాణం, బలోపేతం కోసం మరొక రూ. 3,145 కోట్లు కేటాయించారు. కుప్పం, మడకసిర వంటి చివరి ఆయకట్టు ప్రాంతాలకు సైతం కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించడమే హంద్రీ-నీవా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సాగునీటిని స్థిరపరిచేందుకు గాలేరు-నగరి సుజల స్రవంతి (GNSS) పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertisement

వీటితో పాటుగా తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా చివరి ప్రాంతాల వరకు నీటి పంపిణీని మెరుగుపరుస్తూనే.. చెన్నై నగరానికి ఒప్పందం ప్రకారం తాగునీటి సరఫరాను సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర దీర్ఘకాలిక జల వ్యూహంలో భాగమైన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు గోదావరి అదనపు జలాల సద్వినియోగానికి, నదుల అనుసంధానానికి, కరువు నివారణకు పునాదిగా నిలుస్తున్నాయి.

అమరావతిలో ఎకరా భూమి కొనాలంటే రూ.8.20 కోట్లు పెట్టాల్సిందే.. అమాంతం రేట్లు పెంచేసిన CRDA..కారణం ఏంటంటే..

వీటికి తోడు ఆలూరు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాలకు వేదవతి ప్రాజెక్టు, చిత్తూరు జిల్లా నేవా శాఖా కాలువ ద్వారా నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రతిపాదిత అడవిపల్లి జలాశయం.. కడప జిల్లాకు ప్రయోజనం చేకూర్చే వెలిగొండ ప్రాజెక్టుల పనులు వేగవంతమవుతున్నాయి. నీటి రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆధునీకరణతో పాటు గోరకల్లు, అలగనూరు, జీడిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం ప్లంజ్ పూల్ వద్ద అవసరమైన పునరుద్ధరణ, మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement

మరోవైపు సాగునీటి వ్యవస్థల సమర్థతను పెంచేందుకు ప్రభుత్వం రూ. 4,500 కోట్ల వ్యయంతో 1,049 ఎత్తిపోతల పథకాల ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అధునాతన పంపింగ్ యంత్రాలు, విద్యుత్ సామర్థ్యం గల పరికరాలు, మెరుగైన నిర్వహణతో రూపుదిద్దుకుంటున్న ఈ నెట్‌వర్క్ పూర్తయితే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా 8.2 లక్షల ఎకరాలకు పైగా నిలకడైన సాగునీరు అందుతుంది. అంతేకాకుండా, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు 1,011 సాంప్రదాయ సాగునీటి చెరువుల పునరుద్ధరణను చేపట్టగా.. వాటిలో ఇప్పటికే 530 చెరువులను నీటితో నింపారు. అనిశ్చిత వర్షపాతంపై రాయలసీమ ఆధారపడటాన్ని తగ్గించి, ఈ ప్రాంతానికి శాశ్వత నీటి భద్రతను కల్పించడమే ఈ సమీకృత వ్యూహం అంతిమ ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.