భారత ఈక్విటీ స్టాక్ మార్కెట్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఈక్విరస్ (Equirus) విడుదల చేసిన తాజా 'ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ట్రాకర్' నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఐపీఓ (IPO) పైప్లైన్ మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా 245 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు తమ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లను (DRHP) దాఖలు చేసి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. భారతీయ కంపెనీలు మూలధన సేకరణ కోసం ప్రైమరీ మార్కెట్పై అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుండటానికి ఈ నివేదిక నిదర్శనంగా నిలుస్తోంది.
దాఖలైన మొత్తం 245 DRHPలలో 175 కంపెనీలు ఇప్పటికే మార్కెట్ నిరోధక నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) పరిశీలన దశను దాటి ప్రాథమిక అనుమతులు సాధించాయి. మిగిలిన 70 కంపెనీల దరఖాస్తులు సెబీ వద్ద తుది ఆమోదం కోసం వేచి ఉన్నాయి. నియంత్రణ నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందిన తర్వాత కంపెనీలు నిర్దిష్ట కాలపరిమితిలోనే ఐపీఓను ప్రారంభించాల్సి ఉన్పతి. ఈ క్రమంలో 39 కంపెనీల గడువు సెప్టెంబర్ 2026 నాటికి.. మరో 45 కంపెనీల గడువు డిసెంబర్ 2026 నాటికి ముగియనుంది. మిగిలిన 91 కంపెనీలకు ఆ తర్వాత గడువు ముగియనుండటంతో.. రాబోయే నెలల్లో భారత మార్కెట్లోకి ఐపీఓల వెల్లువ ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సంవత్సరం ప్రైమరీ మార్కెట్లో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన 7 కొత్త ఐపీఓలు, 10 క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు (QIPలు) ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా లిస్ట్ అయిన ఇష్యూలలో 71 శాతం కంపెనీలు ప్రీమియం ధరతో ప్రారంభమై పెట్టుబడిదారులకు మెరుగైన లాభాలను అందించాయి. పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి తగ్గడం కూడా ఐపీఓ కార్యకలాపాలు వేగవంతం కావడానికి దోహదపడింది.
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న పశ్చిమాసియా వార్..
మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) దాదాపు 5 బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తీసుకున్నప్పటికీ.. దేశీయ రిటైల్ పెట్టుబడిదారులు భారత మార్కెట్కు బలమైన రక్షణ కవచంగా నిలిచారు. క్రమశిక్షణతో కూడిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడులు గత ఏడాది రూ. 28,464 కోట్లుగా ఉండగా, ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.31 వేల కోట్లకు చేరుకున్నాయి. ఈ బలమైన రీటైల్ నిధుల ప్రవాహం విదేశీ మూలధన తరలింపుల ప్రభావాన్ని తగ్గించి మార్కెట్ను స్థిరంగా ఉంచగలిగింది.
గడిచిన 12 నెలల వ్యవధిలో జరిగిన నిధుల సేకరణను పరిశీలిస్తే.. మీడియా-కన్స్యూమర్-హెల్త్కేర్ (MCH) రంగం రూ. 1.12 లక్షల కోట్లకు పైగా సేకరించి అగ్రస్థానంలో నిలిచింది. ఇండస్ట్రియల్స్ రంగం రూ. 82,800 కోట్లు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగం రూ. 71,300 కోట్లకు పైగా నిధులను సేకరించాయి. అయితే ఈ నిధుల సేకరణలో అత్యధిక భాగం ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారానే జరగడం విశేషం. అంటే ప్రమోటర్లు తమ పాత వాటాలను విక్రయించి నగదుగా మార్చుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించారు. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే కాలంలో ఈ ఐపీఓల విప్లవం భారతీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని కొత్త వెలుగులను తేనుంది.
More Articles
- Indo-MIM: లిస్టింగ్ రోజే భారీ లాభాలను అందించిన స్టాక్.. 45 శాతం ప్రీమియంలో లిస్ట్ అయిన ఇండో ఎంఐఎం షేర్లు..
- zepto IPO: ఐపీఓ వాల్యూవేషన్ను సవరించిన జెప్టో.. ఎందుకంటే..!
- CXMT Listing: లిస్టింగ్ రోజే 535 శాతం రాబడి అందించిన స్టాక్..
- IPO: ఆగస్ట్లో ఐపీఓల జాతర.. రూ.25 వేల కోట్లు సమీకరించనున్న కంపెనీలు..
- SBI Funds Management: అంచనాలను తలకిందులు చేసిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్.. లిస్టింగ్ ప్రైస్ నుంచి పడిపోయిన స్
- SBI Funds Management: ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓతో కోటీశ్వరులుగా మారిన ఉద్యోగులు..!