గత వారం పెట్టుబడిదారులకు చుక్కలు చూపించిన స్టాక్ మార్కెట్ ఈ రోజు ప్రారంభంలో కొంత ఊరటనిచ్చింది. ఈ వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం, ఐటీ రంగానికి చెందిన ప్రధాన స్టాక్‌లలో పుంజుకున్న బలమైన కొనుగోళ్ల వల్ల సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

Advertisement

ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 636.62 పాయింట్లు లాభపడి 76,696.39 వద్ద కొనసాగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 159.05 పాయింట్లు పెరిగి 23,926.50 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను ప్రతిబింబించే ఇండియా విక్స్ పదునుగా పడిపోవడం.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు తగ్గి విశ్వాసం పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.

Advertisement

ఈ రికవరీకి ప్రధానంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడమే కీలక కారణమైంది. అమెరికా - ఇరాన్ దేశాలు తమ సైనిక దాడులను నిలిపివేయడం ద్వారా పశ్చిమ ఆసియాలో శాంతి వాతావరణం ఏర్పడుతుందనే అంచనాలు పెరిగాయి.

దీనితో బ్రెంట్ క్రూడ్ 4.45% తగ్గి బ్యారెల్‌కు $92.47 వద్దకు.. డబ్ల్యూటీఐ క్రూడ్ 4.71% తగ్గి $85.10 వద్దకు చేరుకున్నాయి. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశానికి చమురు ధరలు తగ్గడం అత్యంత సానుకూల పరిణామంగా మారింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడమే కాకుండా.. దిగుమతి బిల్లులను నియంత్రించి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

Advertisement
స్టాక్ మార్కెట్ మండే ఎలా ఉండబోతోంది.. ఆ ఒక్కటి జరిగితే ఇన్వెస్టర్ల డబ్బు వచ్చే వారం కూడా ఆవిరే..

ఈ ర్యాలీలో టెక్నాలజీ రంగానికి చెందిన స్టాక్‌లు ముందు వరుసలో నిలిచాయి. నిఫ్టీ ఐటీ సూచీ 2.44 శాతం పెరిగి మార్కెట్‌ను నడిపించింది. ఇన్ఫోసిస్ 3 శాతం పైగా లాభపడగా, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్‌టెక్, టిసిఎస్ నిలకడగా పెరిగి మార్కెట్ పురోగతికి ఊతమిచ్చాయి. ఐటీతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మీడియా, రియల్టీ, హెల్త్‌కేర్ వంటి ఇతర అన్ని రంగాలు కూడా విస్తృతమైన లాభాలను నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, సెమీకండక్టర్ స్టాక్‌లలో జరుగుతున్న దిద్దుబాట్ల వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మళ్లీ భారతీయ మార్కెట్ వైపు తమ దృష్టిని మళ్లించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

అయినప్పటికీ మార్కెట్ స్వల్పకాలికంగా పూర్తిగా పుంజుకోవాలంటే నిఫ్టీ సూచీ 24,000 మార్కును అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువన ఉన్నంతవరకు కొంతవరకు అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. 24 వేల మార్కును దాటి నిలబడితే అది 24,200 నుండి 24,300 స్థాయిల వైపు సాగిపోవచ్చు. రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలలో వచ్చే నిలకడ, పశ్చిమ ఆసియా పరిణామాలు భారతీయ మార్కెట్ దిశను నిర్ణయించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.