గత ఐదు రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య సైనిక దాడులు నిలిచిపోవడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ గణనీయంగా బలపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో అన్ని రంగాల్లో కొనుగోళ్ల వేగం పెరిగి బెంచ్‌మార్క్ సూచీలు రోజంతా సానుకూల ధోరణిలో సాగాయి.

Advertisement

ట్రేడింగ్ ముగిసే సమయానికి.. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 776.42 పాయింట్లు (1.02 శాతం) పెరిగి 76,835.78 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 228.50 పాయింట్లు (0.96 శాతం) లాభపడి 23,995.95 వద్ద ముగిసింది. ఉదయం దాడులకు విరామం లభించడంతో నిఫ్టీ 23,900 మార్కును దాటి బలంగా ప్రారంభమైనప్పటికీ.. రోజంతా స్వల్ప పరిధిలోనే కదలాడింది. అయితే ట్రేడింగ్ చివరి గంటలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడంతో నిఫ్టీ ఏకంగా 24 వేల స్థాయిని దాటి, రోజు గరిష్ట స్థాయిల వద్ద ముగిసింది.

Advertisement

పెద్ద కంపెనీలతో పాటు విస్తృత మార్కెట్లోనూ కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.11 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 1.31 శాతం లాభపడింది. ఇది ఇన్వెస్టర్ల ఆసక్తి కేవలం లార్జ్‌క్యాప్ స్టాక్‌లకే పరిమితం కాకుండా మిడ్, స్మాల్-క్యాప్ విభాగాలకు కూడా విస్తరించిందని స్పష్టం చేస్తోంది. నిఫ్టీ 50 విభాగంలో ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రధానంగా లాభపడిన జాబితాలో నిలిచాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Advertisement

రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ మీడియా రరంగం 2.4 శాతంతో అత్యధిక లాభాలను నమోదు చేయగా, నిఫ్టీ ఐటీ 2.3 శాతం పురోగమించింది. వీటితో పాటు నిఫ్టీ రియల్టీ 2.2 శాతం, ఆటో 1.6 శాతం, ఫార్మా 1.5 శాతం మేర లాభపడ్డాయి. అలాగే ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్, పిఎస్‌యు బ్యాంకింగ్ రంగాలు కూడా సానుకూల ఫలితాలను సాధించాయి.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా జంప్.. ఈ మూడు కారణలతో షేర్ మార్కెట్లో ఊపు.
Advertisement

మార్కెట్లోని బుల్లిష్ ట్రెండ్‌కు బలాన్నిస్తూ రామకృష్ణ ఫోర్జింగ్స్, లారస్ ల్యాబ్స్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, ఫెడరల్ బ్యాంక్ వంటి దాదాపు 140 కంపెనీల స్టాక్‌లు తమ 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్లకు అనుకూలించిన అంశాల ప్రభావంతో కరెన్సీ మార్కెట్లోనూ రూపాయి గణనీయంగా పుంజుకుంది. శుక్రవారం నాటి ముగింపు స్థాయి 96.57తో పోలిస్తే, అమెరికన్ డాలర్‌తో రూపాయి మార్పిడి విలువ సోమవారం 68 పైసలు బలపడి 95.89 వద్ద ముగిసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.