అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలపై వచ్చిన వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఈ పరిణామం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరచడంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది.బీఎస్‌ఈ సెన్సెక్స్ 544 పాయింట్లు (0.70 శాతం) ఎగబాకి 78,639 వద్ద ముగియగా, నిఫ్టీ50 24,774 స్థాయికి చేరుకుంది.

Advertisement

మార్కెట్‌లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయి.నిఫ్టీ50 సూచీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేసి సూచీలకు మద్దతుగా నిలిచాయి. విస్తృత మార్కెట్‌లోనూ కొనుగోళ్ల జోరు కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.21 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 1.29 శాతం లాభపడటంతో మార్కెట్‌లో పెట్టుబడిదారుల విశ్వాసం బలంగా కనిపించింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. మరోవైపు, నిఫ్టీ మీడియా సూచీ మాత్రం ఆ రోజు అత్యంత బలహీనమైన రంగంగా నిలిచింది.

Advertisement

ఇదిలా ఉంటే దేశీయ స్టాక్ మార్కెట్ ముగింపు సమయాల్లో మంగళవారం ట్రేడర్లు, బ్రోకర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిఫ్టీ స్పాట్ సూచీ దాదాపు 1.6 శాతం మేర పెరిగి ముగియగా.. నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం కేవలం 0.87 శాతం లాభంతో సరిపెట్టుకుంది. సూచీల ముగింపు రాబడులలో కనిపించిన ఈ వ్యత్యాసం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు మధ్యాహ్నం 3:15 గంటల తర్వాత ట్రేడింగ్ స్క్రీన్లపై ధరలు సరిగ్గా కనిపించకపోవడం, ఆర్డర్లు తిరస్కరణకు గురికావడం వంటి సాంకేతిక చిక్కులను చాలామంది ఇన్వెస్టర్లు ఎదుర్కొన్నారు.

Advertisement

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిబంధనల ప్రకారం.. డెరివేటివ్స్ (F&O) విభాగంలో ఉన్న స్టాక్స్ యొక్క క్యాష్ సెగ్మెంట్‌లో సాధారణ ట్రేడింగ్‌ను మధ్యాహ్నం 3:15 గంటలకు నిలిపివేశారు. ఆ తర్వాత 3:15 నుండి 3:35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 3:15 నుండి 3:20 గంటల మధ్య సమయాన్ని 'మార్పు వ్యవధి'గా కేటాయించడంతో ఆ సమయంలో కొత్త ఆర్డర్ల నమోదును ఎక్స్ఛేంజ్ అనుమతించలేదు. ఈ విషయం తెలియక ఎప్పటిలాగే ఆర్డర్లు పెట్టిన వ్యాపారుల అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయి.

స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. క్రూడ్ ఆయిల్ పతనంతో పుంజుకున్న సూచీలు.. కుప్పకూలిన ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు..
Advertisement

నిఫ్టీ స్పాట్ అనేది క్యాష్ మార్కెట్‌లోని 50 షేర్ల ఆధారంగా లెక్కించబడుతుంది. వేలం ప్రక్రియ ముగిశాక వీటికి ముగింపు ధర నిర్ణయమవుతుంది. కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్. దీని ముగింపు ధరను నిర్ణయించడానికి మధ్యాహ్నం 3:10 నుండి 3:40 గంటల మధ్య నమోదైన 30 నిమిషాల వేటెడ్ యావరేజ్ ప్రైస్ (VWAP) ఆధారంగా లెక్కిస్తారు. వడ్డీ రేట్లు, డివిడెండ్లు, కాంట్రాక్ట్ గడువు సమయం మరియు మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు ఫ్యూచర్స్, స్పాట్ మధ్య ఉండే 'బేసిస్' అంతరాన్ని ప్రభావితం చేశాయి.

Advertisement

మొదటి రోజు కావడం వల్ల సిస్టమ్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడంతో బ్రోకర్లు, క్లయింట్లు ఇబ్బందులు పడ్డారని.. ఇది తాత్కాలిక సవాలు మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. F&O స్టాక్స్‌లో మధ్యాహ్నం 3:15 నుండి 3:20 గంటల మధ్య ఆర్డర్లు పెట్టకూడదని.. 3:20 నుండి 3:25 గంటల మధ్య పరిమిత సంఖ్యలో ఆర్డర్లు సబ్మిట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంట్రాడే, ఆప్షన్స్ ట్రేడర్లు స్పాట్, ఫ్యూచర్స్ ముగింపు సమయాలు వేర్వేరు అని గ్రహించి పొజిషన్లు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.