ఈ రోజు ఉదయం భారత స్టాక్ మార్కెట్ ఆరంభంలో ఇన్వెస్టర్లు ఒక ఆసక్తికరమైన కదలికను గమనించారు. సాధారణంగా ఒకే దిశలో ప్రయాణించే నిఫ్టీ 50, బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలు విభిన్న దిశల్లో కదిలాయి. ఉదయం 9:42 గంటల సమయంలో నిఫ్టీ 50 దాదాపు 100 పాయింట్లు పడిపోయి 24,460 వద్ద ట్రేడవ్వగా.. సెన్సెక్స్ మాత్రం 166 పాయింట్లు పెరిగి 78,805 వద్ద కొనసాగింది.

Advertisement

మధ్యాహ్నం 2 గంటల సమయానికి కూడా సెన్సెక్స్ అర శాతం క్షీణించగా.. నిఫ్టీ 1.5 శాతం పతనమైంది. మార్కెట్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) స్పష్టత నిచ్చింది. ఇది సాంకేతిక లోపం కాదని, ఇటీవలే అమలులోకి వచ్చిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానం వల్ల ఏర్పడిన మార్పు మాత్రమేనని వెల్లడించింది.

Advertisement

ఏమిటీ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS)? : గతంలో షేర్ల ముగింపు ధరను ట్రేడింగ్ ముగిసే చివరి 30 నిమిషాల సగటు ధర (VWAP - వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్) ఆధారంగా నిర్ణయించేవారు. అయితే కొత్త విధానంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) పరిధిలోకి వచ్చే షేర్ల తుది ధరను క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ద్వారా నిర్ణయిస్తున్నారు.

ఈ ప్రక్రియలో కొనుగోలు, అమ్మకం ఆర్డర్లను సేకరించి గరిష్ట సంఖ్యలో ట్రేడ్‌లు పూర్తయ్యేలా ఒక సమతుల్య ధరను (Equilibrium Price) సిస్టమ్ లెక్కిస్తుంది. సాధారణ ట్రేడింగ్ సమయానికి, CAS ప్రక్రియకు వేర్వేరు ఆర్డర్ బుక్స్ ఉండటంతో ఒకే స్టాక్ ధర రెండు చోట్లా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలలో ఉండే కంపెనీలు, వాటి వెయిటేజీలు భిన్నంగా ఉండటం వల్ల ఈ ప్రభావం రెండు సూచీలపై వేర్వేరుగా కనిపిస్తోంది.

Advertisement
ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. స్టాక్ మార్కెట్ క్లోజ్ టైమ్ మారింది.. కొత్తగా క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అమల్లోకి..

కొత్త నిబంధనల ప్రకారం.. మధ్యాహ్నం 3:15 నుండి 3:30 గంటల మధ్య నిరంతర ఆర్డర్ మ్యాచింగ్ ఉండదు. ఇన్వెస్టర్లు తమ ఆర్డర్లలో మార్పులు చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్ గరిష్ట ట్రేడ్లను పూర్తి చేసే సమతుల్య ధరను నిర్ణయిస్తుంది. అందుకే ఈ సమయంలో స్క్రీన్‌పై కనిపించే ఇండెక్స్ విలువలు ప్రతి సెకనుకు మారకుండా కొంతసేపు స్థిరంగా కనిపించవచ్చని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

Advertisement

ఆగస్టు 3న ప్రారంభమైన ఈ కొత్త CAS విధానం తొలి రోజున స్పాట్, ఫ్యూచర్స్ ధరల మధ్య వ్యత్యాసాలకు కారణమైందన్న ఆందోళనలను ఎన్‌ఎస్‌ఈ తోసిపుచ్చింది. మొదటి రోజున 515 మంది ట్రేడింగ్ సభ్యులు.. 56,773 వేర్వేరు పాన్ కార్డుల ద్వారా ఆక్షన్ ప్రక్రియలో పాల్గొన్నారని.. భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఎక్స్ఛేంజ్ పేర్కొంది.

క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ప్రక్రియ మధ్యాహ్నం 3:15 నుండి 3:35 వరకు జరుగుతుండగా.. ఈక్విటీ డెరివేటివ్స్ నందు నిరంతర ట్రేడింగ్ 3:40 వరకు కొనసాగుతుంది. క్యాష్ మార్కెట్ ముగింపు ధరల ప్రభావం ఫ్యూచర్స్, ఆప్షన్స్ ప్రీమియంలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్‌పైరీ రోజున ఆఖరి నిమిషాల్లో స్పాట్ ధరలో 2-3 పాయింట్ల చిన్న మార్పు వచ్చినా.. ఆప్షన్స్ ధరలు విపరీతంగా మారే ప్రమాదం ఉంది.

Advertisement

మధ్యాహ్నం 3:25 నుండి 3:30 మధ్య మార్కెట్ కదలికలపై నియంత్రణ ఉండదు కాబట్టి.. సరిగ్గా స్క్వేర్ ఆఫ్ చేయకపోతే తీవ్ర నష్టాలు తప్పవని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సగటు రీటైల్ ఇన్వెస్టర్లు ఉదయం వేళల్లో కనిపిచే ఇండెక్స్ వ్యత్యాసాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. క్రమంగా మార్కెట్ ఈ నూతన ఆక్షన్ విధానానికి అలవాటుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.