ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయి రికార్డు క్రియేట్ చేసిన ఆర్థిక పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే తీవ్రమైన ఆర్థిక మాంద్యం, పతనం గురించి తన హెచ్చరికను మరోసారి పునరుద్ఘాటించారు. మానవాళి చరిత్రలోనే అత్యంత భారీ ఆర్థిక సంక్షోభాలలో ఒకటి సంభవించబోతోందని తాజా X (ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలే ఒక వ్యక్తిని ధనవంతుడిగా లేదా పేదవాడిగా మారుస్తాయని తెలిపారు.

Advertisement

తాను సంవత్సరాల క్రితమే రాసిన రిచ్ డాడ్స్ ప్రాఫసీ అనే పుస్తకంలో ఈ తరహా గ్లోబల్ ఆర్థిక పతనాన్ని ముందే ఊహించానని కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ పుస్తకంలోని మార్గదర్శకాలను పాటించిన పాఠకులు నేడు సురక్షితమైన, బలమైన ఆర్థిక స్థితిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మాంద్యం ఇప్పటికే ప్రారంభమైందని తాను భావిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు తమ వ్యూహాలను మార్చుకోవడానికి ఇంకా సమయం మించిపోలేదని చెప్పారు. ప్రతి ఆర్థిక సంక్షోభం అపారమైన నష్టాలతో పాటుగా.. తెలివిగా వ్యవహరించే కొద్దిమందికి సంపదను పునఃపంపిణీ చేసుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఈ చారిత్రాత్మక మార్కెట్ పతనాన్ని తట్టుకోవడానికి, ఆర్థిక అనిశ్చితిని అధిగమించడానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులను కలిగి ఉండాలని కియోసాకి నిరంతరం సూచిస్తున్నారు. దిగ్గజ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో ఆకాశాన్ని తాకుతాయని అంచనా వేశారు. ఇటీవల బంగారం ధర ఔన్సుకు 5,405 డాలర్ల నుండి 4,006 డాలర్లకు, వెండి 118 డాలర్ల నుండి 56 డాలర్లకు పడిపోవడం వంటి పరిణామాలను తాత్కాలిక మార్కెట్ దిద్దుబాట్లుగా ఆయన అభివర్ణించారు. సాధారణ స్పెక్యులేటర్లు ధరలు గరిష్టంలో ఉన్నప్పుడు కొని.. పడిపోయినప్పుడు అమ్మే పొరపాటు చేస్తారని, కానీ తాను మాత్రం ఈ క్రాష్ ను అవకాశంగా తీసుకుని మరిన్ని విలువైన లోహాలను కొనుగోలు చేస్తున్నానని వెల్లడించారు.

Advertisement
బంగారం, వెండి ధరలు ఆకాశానికి.. మధ్యలో మాత్రం పాతాళానికి.. రాబర్ట్ కియోసాకి షాకింగ్ కామెంట్స్..

ప్రపంచ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలకు.. విధానకర్తలకు లేదా కేంద్ర బ్యాంకులకు తగిన సామర్థ్యం లేదని కియోసాకి తీవ్రంగా విమర్శించారు. నిజానికి పెరిగిన అప్పులు, ద్రవ్యోల్బణానికి వారే ప్రధాన కారణమని, అందుకే సాంప్రదాయ ఫియట్ కరెన్సీల కంటే భౌతిక ఆస్తులే నమ్మదగినవని ఆయన వాదించారు. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధరకు కొని ధనవంతులు అవుతారా అని ప్రశ్నిస్తూ.. సరైన సమయంలో సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

1997లో వెలువడిన రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి.. కేవలం ఉద్యోగ ఆదాయంపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, కమోడిటీస్ వైపు దృష్టి సారించాలని పదేపదే చెబుతుంటారు. సాంప్రదాయ పొదుపరులు మాంద్యం సమయంలో అత్యంత ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పదేపదే హెచ్చరిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.