బంగారు బాండ్లు- పెట్టుబడి కోసం ఒక మంచి మార్గం
బంగారానికి ప్రత్యామ్నాయంగా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక గ్రాము పసిడికి సమానమైన సావరిన్ గోల్డ్ బాండ్ జారీ ధరను ఈ సారి రూ.2901గా నిర్ణయించారు. ఈ బాండ్ ఇష్యూ ధరపై ప్రతి గ్రాముకు రూ.50 రా
మరోదఫా పసిడి బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ నెల 24న ప్రారంభం అయిన సావరిన్ గోల్డ్ బాండ్( ఎస్జీబీ)ల జారీ ప్రక్రియ 28న ముగుస్తుంది.బంగారానికి ప్రత్యామ్నాయంగా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక గ్రాము పసిడికి సమానమైన సావరిన్ గోల్డ్ బాండ్ జారీ ధరను ఈ సారి రూ.2901గా నిర్ణయించారు. ఈ బాండ్ ఇష్యూ ధరపై ప్రతి గ్రాముకు రూ.50 రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని అంశాలు....
1. అర్హత
దేశంలో ఉండే భారత పౌరులు, అవిభక్త హిందూ కుటుంబాలు(హెచ్యూఎఫ్), ట్రస్ట్లు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
2. దరఖాస్తు తేదీలు
ఈ నెల 24 వ తేదీ నుంచి 28 వరకూ పసిడి బాండ్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుండగా, బాండ్లను మాత్రం వచ్చే నెల 12న జారీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అక్షయ తృతీయకు ముందురోజు దరఖాస్తు గడువు ముగుస్తుంది
3. వడ్డీ రేటు
ఈ పసిడి బాండ్లపై వడ్డీరేటును 2.75 శాతంగా నిర్ణయించింది.ప్రారంభ పెట్టుబడిపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. ఇతర పెట్టుబడులను పోల్చి చూస్తే బంగారు బాండ్లపై వచ్చే వడ్డీ ఆసక్తికరంగా ఉండదు. అయినప్పటికీ బంగారు విషయంలో చూస్తే ఇది బాగానే ఉంది.
4. బాండ్ల కాలపరిమితి
ఈ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించింది. ఐదేండ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కు తీసుకోవాలనుకుంటే అందుకు వీలు కల్పిస్తారు. అటువంటి సందర్భంలో బాండ్ల జారీ విలువ లభించనున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి వెనక్కు తీసుకునే పెట్టుబడిదారులకు మూలధన పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.
5. పెట్టుబడి పరిమితులు
కనీసంగా ఒక గ్రాము గోల్డ్ బాండ్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఏడాదికి ఒక వ్యక్తి 500 గ్రాముల కంటే అధికంగా కొనుగోలు చేయకూడదు.
6. ఎక్కడ కొనవచ్చు?
ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీస్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సేంజ్లైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈ బాండ్లు లభించనున్నాయి.
7. ఉమ్మడి హోల్డర్లు...
ఎవరితోనైనా కలిసి 500 గ్రాముల పసిడికి సమానమైన ఎస్జీబీలు కొనుగోలు చేస్తే అన్నీ మొదటి దరఖాస్తుదారుడి పేరే మీదే ఉంటాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల పరంగా చూస్తే బంగారానికి మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. యూఎస్ వడ్డీ రేట్ల ప్రభావం పసిడిపై ఉంటుందని మరవద్దు.
8. చెల్లింపులు:
రూ. 20 వేల వరకూ నగదు ద్వారా చెల్లించవచ్చు. అంతకు మించితే మాత్రం డీడీ, చెక్కులు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపు పద్దతులను ఉపయోగించి చేయాల్సి ఉంటుంది.
9. రుణ అర్హత
ఈ బాండ్లను హామీగా ఉంచి రుణాలను సైతం పొందే వీలుంటుంది. ఆర్బీఐ నిర్దేశించిన బంగారు రుణాలకు వర్తించే లోన్ టు వాల్యూ(ఎల్టీవీ) నిబంధనలు అన్నీ ఈ బాండ్లకు వర్తిస్తాయి.
10.పన్నులు
ఈ బాండ్లపై అందుకునే వడ్డీ ఆదాయం ఆదాయం పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తుంది. వ్యక్తులు ఈ బాండ్లను అమ్ముకుంటే దానిపై వచ్చే మూలధన లాభాలపై పన్ను ఉండదు. ఈ బాండ్ల బదిలీ వల్ల వ్యక్తులకు సమకూరే మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయి.