ఇకపై ఒక రోజులోనే పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయం
ఉద్యోగం చేసే వాళ్లందరికీ పీఎఫ్తో అవినాభావ సంబంధం ఉంటుంది. మన మూలవేతనంలో 12% పీఎఫ్ రూపంలో మినహాయిస్తారని ఉద్యోగులందరికీ తెలుసు. అయితే కంపెనీ మారినప్పుడు, అత్యవసరాల్లోనూ పీఎఫ్ తీసుకునేందుకు
ఉద్యోగం చేసే వాళ్లందరికీ పీఎఫ్తో అవినాభావ సంబంధం ఉంటుంది. మన మూలవేతనంలో 12% పీఎఫ్ రూపంలో మినహాయిస్తారని ఉద్యోగులందరికీ తెలుసు. అయితే కంపెనీ మారినప్పుడు, అత్యవసరాల్లోనూ పీఎఫ్ తీసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇదివరకూ ఈ ప్రక్రియ చాలా కఠినంగా ఉండేది. అంతా ఆన్లైన్ ప్రక్రియకు మారుతున్నందున పీఎఫ్ విత్డ్రాయల్ను సులువుగా చేసుకునేలా ఈపీఎఫ్వో చర్యలు చేపట్టింది. అవేంటో తెలుసుకుందాం.
నిబంధనల మార్పు
ఇంతకు ముందు వివిధ అవసరాల కోసం పీఎఫ్ సొమ్ము విత్డ్రా చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించే సరికి విసుగు వచ్చేది. దీంతో కొన్ని నిబంధనలను మార్చారు. ఇకపై వివాహ ఖర్చుల నేపథ్యంలో ముందస్తుగా కొంత సొమ్మును తీసుకునేందుకు కచ్చితంగా వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించాల్సిన పని లేదు. అంతే కాకుండా ఏదైనా అవసరాలకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోని డబ్బు వాడుకుంటే యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు బదులుగా సెల్ఫ్ యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పిస్తే చాలని భవిష్య నిధి నియంత్రణ సంస్థ తెలిపింది.
ఒకే ఫారం
పీఎఫ్ విత్డ్రా చేసే విధానం సులభంగా ఉండేందుకు వీలుగా యూఏఎన్తో ఆధార్ను అనుసంధానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం నింపే ఫారంల విషయంలో ఖాతాదార్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఈపీఎఫ్వో ఇందులో సైతం మార్పులు చేసింది. అడ్వాన్స్, విత్డ్రాయల్స్ కోసం ఇంతకుముందు ఉన్నట్లుగా వేర్వేరు ఫారంలు కాకుండా దాన్ని సులభతరం చేసి, ఒకే ఉమ్మడి ఫారంను తీసుకువచ్చారు. కొత్త ఉమ్మడి ఫారం(ఆధార్)ను ఉద్యోగులు సంస్థ అటెస్టేషన్ లేకుండా సమర్పించవచ్చని ఈపీఎఫ్వో వెల్లడించింది.
ఎవరికి ఏ క్లెయిం ఫారం?
ఇది వరకే యూఏఎన్ ఖాతాకు ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధాం చేసిన చందాదారులు నేరుగా పీఎఫ్ కార్యాలయానికి తమ ఫారంలను సమర్పించవచ్చు. వీటికి ఆయా సంస్థల అటెస్టేషన్ అక్కర్లేదు. ఆధార్ సంఖ్యను పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసేందుకు మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆధార్ అనుసంధానం పూర్తి కాని వారు క్లెయిం ఫారం(నాన్-ఆధార్)ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే దీన్ని సంస్థ అటెస్టేషన్తోనే సమర్పించాలని ఈపీఎఫ్వో తెలిపింది.
ఇకపై ఒక్క రోజులోనే పీఎఫ్ క్లెయిం
మొత్తం కార్యాలయాలను, కేంద్ర సర్వర్తో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోందని, మే నెలాఖరుకు అన్ని దరఖాస్తులను, క్లైయిమ్స్ ఆన్ లైన్లోనే చేపట్టవచ్చని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. దరఖాస్తు నమోదుచేసిన కొన్ని గంటల్లోనే క్లైయిమ్స్ను సెటిల్ చేసేలా ఈపీఎఫ్ఓ ఈ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభిస్తుందని అధికారులు చెప్పారు. దీంతో ఇక ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లైయిమ్ ప్రక్రియ మూడు గంటల్లోనే ముగియనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 20 రోజుల వ్యవధి పడుతోంది. ఈ ఆన్ లైన్ ప్రక్రియ కోసం పెన్షనర్లు, సబ్ స్క్రైబర్లందరూ తప్పనిసరి ఈపీఎఫ్ఓ వద్ద తమ ఆధార్ నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. పీఎఫ్ చందాదార్లు ఆన్ లైన్ సౌకర్యాన్ని వాడుకునేందుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఉపకరించనుంది.