పొదుపు, పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నారా? రిటైర్మెంట్ ప్లానింగ్ ఇదిగో...
ఆరు పదుల వయసులో నాకేం అవసరాలు ఉంటాయనే నిర్లిప్తతను వదలాలి. ఆ వయసులో ఎవరిపైనా ఆధారపడలేని పరిస్థితి రాకుండా ఉంటుందనే మానసిక భావనతో ఆర్థిక ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్
ఉద్యోగం చేసే ఎవరైనా సరే ఏదో ఒక రోజు పదవీ విరమణ చేయక తప్పదు. ఇష్టం ఉన్నా లేకున్నా వయసు పైబడుతున్నకొద్దీ ఇదే జరుగుతుంది. పదవీ విరమణ రోజు కోసం మానసికంగా, శారీరకంగా కాకుండా ఆర్థికంగా కూడా సిద్ధంగా ఉండాలి. 25-30 ఏళ్ల వయసులో ఉన్నా, 50-55 ఏళ్ల వయసు వచ్చినా రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది. జీవితంలో వ్యక్తుల ఆదాయం, ఆర్ధిక స్థోమత ఎప్పుడూ ఒకేలా ఉండవు. మరి ఇలాంటప్పుడు అందరికీ ఒకేలా ఆర్ధిక ప్రణాళిక ఉండదు. రిటైర్మెంట్ తర్వాత ఎంత అవసరం , మలి వయసులో పెద్దగా ఖర్చులేముంటాయి? అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం వచ్చినా సరిపోతుందని అనుకుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత వయసులో ఆదాయం ఉండదు గానీ, ఖర్చుల్లో మాత్రం పెద్ద తేడా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రణాళిక కలిగి ఉండాలో చూద్దాం.
బడ్జెట్ ముందుగా వేసుకోండి
ఖర్చుల నిమిత్తం ముందుగానే కొంత మొత్తానికి పక్కనపెట్టాలి. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు మీరు వీటని ఉపయోగించుకుని వెసులుబాటు ఉంటుంది. నలభై వయసులో రిటైర్మెంట్ జీవితాన్ని ప్లాన్ చేసుకునే వ్యక్తులు ముందుగా తమ ఆస్తులు, ఆర్థిక బాధ్యతల కోసం చేయాల్సిన ఖర్చుతో ఒక బ్యాలెన్స్ షీట్ తయారుచేసుకోవాలి. అందులో అప్పటివరకూ సంపాదించిన ఆస్తుల, నగదు, ఆభరణాలు, పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్ల కోసం వెచ్చించాల్సిన ఖర్చులు, రుణాల వివరాలు ఉండేలా చూసుకోవాలి.
ఇన్సూరెన్స్
మలి వయసులో వైద్యం కోసం చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీతో పాటు జీవిత భాగస్వామికి హోల్ లైఫ్ రెన్యువల్ చేసుకునే వీలుండే ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటే మంచిది. ఇప్పటికీ మీకు జీవిత బీమా పాలసీ లేకపోతే కచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందే. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల అవసరాలు, మీ ఆదాయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన బీమా హామీ మొత్తం కలిగిన టర్మ్ పాలసీని కొనుగోలు చేయండి.
రాబడి వచ్చే పథకాల్లో పొదుపు
నష్టభయం లేని పథకాల్లో పొదుపు చేస్తే మంచిది. పెట్టుబడులను వీలైనంత తొందరగా ప్రారంభించాలి. క్రమం తప్పకుండా పెట్టుబడులను కొనసాగించాలి. పథకాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు ఆర్ధిక పరిస్ధితిని సమీక్షించుకోవాలి.
జీవిత బీమా పాలసీలు, మ్యూచవల్ ఫండ్లు, బంగారం, డెట్ పథకాల్లో మదుపు చేయాలి. భవిష్యత్తు కోసం మీరు ఎంత మొత్తం జమ చేయాలో తెలుసుకునేందుకు ఆన్లైన్లో రిటైర్మెంట్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో రిటైర్మెంట్కు ముందు ఎంత మొత్తంలో నిధి అవసరమో చూసుకోవచ్చు.
అత్యవసర నిధి
మలివయసులో అత్యవసర నిధి ఎంతో అవసరం. వైద్య ఖర్చుల నిమిత్తం గానీ, అనుకోకుండా వచ్చిన ఖర్చులను తట్టుకోవాలంటే అత్యవసర నిధి చాలా అవసరం. రిటైర్మెంట్కు ముందు మనం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తు ఆర్ధిక ఉన్నతిపై ఆధాపడి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడం కోసం క్రమబద్ధంగా మదుపు చేయం ఎంతో ముఖ్యం.
ఎందులో పెట్టుబడులు పెడుతున్నారనేది ముఖ్యం
చాలా మంది బంగారం, స్థిరాస్తి రూపంలో ఎక్కువ ఆస్తులను కూడబెడుతుంటారు. వయసు ఎంత పెరుగుతున్నా నాకేంటి అంతా కులాసాగా సాగుతోందనే ధీమాతో ఉంటారు. ఇప్పటి జీవనశైలి కారణంగా ఎవరికి ఎలాంటి అనారోగ్యం వస్తుందో, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పడం కష్టం. 2008 ఆర్థిక సంక్షోభానికి కారణం అమెరికాలో స్థిరాస్తి రంగంలో తీవ్రమైన కుదుపు రావడమే. అప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలో చాలా దేశాల్లో రియల్ ఎస్టేట్ ప్రభావితమయింది. ప్రస్తుతం బంగారం ధరలు సాధారణంగానే ఉన్నాయి. పదవీ విరమణ ప్రణాళిక వేసుకునే వ్యక్తులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు వివిధ మార్గాల్లో ఉంచుతూ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ద్రవ్యోల్బణం
వేతనాలు 20,30 శాతం పెరుగుతున్నప్పటికీ ప్రతి సంవత్సరం మార్కెట్లో ధరల పెరుగుదల ఎలా ఉందో గమనించుకోవాలి. ద్రవ్యోల్బణం ప్రభుత్వ లెక్కల ప్రకారం తక్కువనే కనిపిస్తుంది. వాస్తవానికి అంతకు రెండింతలు మనపై ధరల భారం పడుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం సగటున 6 నుంచి 8 శాతం ఉంటుందనుకుంటే ప్రస్తుతం రూ. 1000 విలువ చేసే వస్తువు ధర 12 సంవత్సరాల్లో రూ. 2000 నుంచి 2500 వరకూ పెరుగుతుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే దీన్ని గమనించుకోవడం మంచిది.
రిటైర్మెంట్ లేదా పింఛను పాలసీలు
రిటైర్మెంట్ వరకూ వివిధ రకాల పెట్టుబడుల్లో డబ్బును మదుపు చేసి బీమా పాలసీలను నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వారి కోసమే ఇది. పింఛను పాలసీల్లో ఎండోమెంట్, యూనిట్ లింక్డ్ పాలసీలు అనే రెండు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇతర పాలసీల్లా కాకుండా ఉద్యోగం మానేసిన తర్వాత ఉపయోగపడే విధంగా ఇవి పనిచేస్తాయి. రిటైర్మెంట్ పాలసీల్లో సాధారణంగా రెండు దశలు ఉంటాయి. పాలసీ గడువు వరకు ప్రీమియం చెల్లిస్తూ నిధిని సమకూర్చుకోవడం. రెండో దశ గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తాన్ని ఐఆర్డీఏ నిర్దేశించిన యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం. దానిపై నెల నెలా వడ్డీ పెన్షన్ రూపంలో వస్తుంది. పాలసీ గడువు తీరిన తర్వాత సమకూరిన నిధి నుంచి 30 నుంచి 40 శాతం వరకే వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కచ్చితంగా ఏదేనీ పెన్షన్ యాన్యుటీ ఫథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల కంటే యూనిట్ ఆధారిత పాలసీల్లో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.
ముగింపు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పదవీ విరమణ ప్రణాళికను నిర్లక్ష్యం చేసేవారికి ఇది బాగా నప్పుతుంది. ఆరు పదుల వయసులో నాకేం అవసరాలు ఉంటాయనే నిర్లిప్తతను వదలాలి. ఆ వయసులో ఎవరిపైనా ఆధారపడలేని పరిస్థితి రాకుండా ఉంటుందనే మానసిక భావనతో ఆర్థిక ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ను ఆలస్యంగా చేసుకున్నా, అసలు ప్లానింగ్ అంటూ ఉంటే మలి వయసులో ఆర్థిక ధీమాతో ఉండొచ్చు.