రెపోరేటు ఎఫెక్ట్: వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకులు
ముంబై: మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘరామ్ రాజన్ రెపో రేటును అరశాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పలు బ్యాంకులు తమ కనీస వడ్డీ రేట్లను తగ్గించినట్లు బుధవారం ప్రకటించాయి. నూతన వడ్డీరేట్లు అక్టోబర్ 5 నుంచి అమలులోకి రానున్నాయి.
తాజాగా ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(పీఎస్బీ) సహా ప్రైవేటు రంగంలో మూడవ పెద్ద బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్తో సహా బుధవారం వడ్డీరేటు తగ్గించినట్లు ప్రకటించాయి.
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మంగళవారమే ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల దీనికి అనుసంధానమైన గృహ, వాహన, విద్యా రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఎస్బీఐ తరహాలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.4 శాతం బేస్ రేటును తగ్గించింది. దీనితో బ్యాంక్ రేటు 9.60 శాతానికి చేరింది. అక్టోబర్ 1 నుంచీ ఈ మారిన రేటు అమల్లోకి వస్తుంది.
ఐడీబీఐ బ్యాంక్
బేస్రేటు 0.25 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.75 శాతానికి తగ్గింది. కాగా ఐడీబీఐ బ్యాంక్ కొన్ని టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా పావుశాతం నుంచి అరశాతం వరకూ తగ్గించింది. తాజా రేటు అక్టోబర్ 5 నుంచీ అమల్లోకి వస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.65 శాతానికి పడింది. అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)ను కూడా బ్యాంక్ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 13.90 శాతానికి పడింది.
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
ఓబీసీ 20 బేసిస్ పాయింట్లు కోసింది. దీనితో ఈ రేటు 9.70 శాతానికి దిగింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పావు శాతం వరకు తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ బేస్రేటు 9.75 శాతానికి జారుకుంది. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత చౌకకానున్నాయి.
యాక్సిస్ బ్యాంక్
దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ బేస్రేటును 35 బేసిస్ పాయింట్లు లేక 0.35 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కనీస వడ్డీరేటు 9.50 శాతానికి చేరుకుంది. ఈ వడ్డీరేట్లు వచ్చే నెల 5 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.