పిల్లల చదువు: పొదుపు చేయడం ఎలా?
ఒకప్పుడు ఎవరికైనా పెళ్లి చేయడం, ఇల్లు కట్టుకోవడం ఈ రెండే ఆర్ధిక లక్ష్యాలుగా ఉండేవి. ఉద్యోగస్తులు రిటైరయ్యేలోపు ఈ రెండింటినీ సాధిస్తే చాలనుకునేవారు. ఒకవేళ సాధించలేకపోయినా, పిల్లలకు పెళ్లిళ్లు చేసి, రిటైరైన తర్వాత వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుని, ఆ తర్వాత ఫించన్తో హాయిగా జీవించేవారు.
కానీ రోజులు మారాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు, పిల్లల పెళ్లి కంటే ముందు వాళ్ల చదువుల గురించి ఆలోచించిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లల చదువులు మరింత భారంగా మారాయి. మరి అలాంటప్పుడు పిల్లల చదువుల కోసం పొదుపు చేయాలంటే అందుబాటులో ఉన్న ఏయే మార్గాలున్నాయో చూద్దాం.
స్ధిరమైన ఆదాయం కోసం
ఎలాంటి రిస్క్ తీసుకోలేని వారు స్ధిరమైన ఆదాయాన్ని ఇచ్చేటటువంటి బ్యాంకు డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ వంటి పథకాలను ఎంచుకుంటే మంచిది. పిల్లల పెళ్లిళ్ల కోసం నిధిని సమకూర్చుకోవాలి అనుకునే వారు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకం బాగుంటుంది.
పన్ను మినహాయింపు
సుకన్య-సమృద్ధి తర్వాత రిస్క్ తక్కువగా ఉన్న దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకం అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ను ఎంచుకోవడం మంచిది. ఈ పథకం కింద 15 ఏళ్ళ కాలపరిమితికి 8.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ఎక్కువ మంది బీమానే ఎంచుకుంటున్నారు
పిల్లల కోసం పొదుపు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి బీమా పథకాలే. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు పలు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. పిల్లల కోసం పెట్టుబడి పెడుతున్న వారిలో అత్యధికంగా 64 శాతం మంది బీమా పథకాలవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యనే ఎల్ఐసీ చైల్డ్ కేర్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీలను ప్రవేశపెట్టింది.
జాగ్రత్తలు పాటించండి
సాధ్యమైనంత త్వరగా పెట్టుబడిని ప్రారంభించాలి. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అధిక మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. మీ సంపాదనలో అధిక భాగం ఈక్విటీలకు కేటాయించాలి. మీరు ఎంచుకున్న పథకం మీ లక్ష్యానికి అనువుగా ఉందో లేదో పరిశీలించండి.
చదువు కోసం పొదుపు మంచిదేగా?
పిల్లల కోసం రకరకాల పొదుపు చేస్తున్న పలువురితో ఈ మధ్య ఓ ప్రయివేటు బీమా సంస్థ సర్వే చేసింది. సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పిల్లలకోసం పొదుపు చేస్తున్న వారిలో 77 శాతం మంది పిల్లల చదువు కోసం చేస్తుండగా, మిగతా 23 శాతం మంది మాత్రం వారి పెళ్లి కోసం చేస్తున్నారు.
పిల్లలు చదువు మరింత భారంగా?
విద్యా వ్యయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతోందని, దీంతో పిల్లలకు సరైన చదువు చెప్పించగలమా? లేదా? అనే భయం తల్లిదండ్రులను వెంటాడుతోందని పలువురు తమ అభిప్రాయంగా చెప్పారు. విద్యావ్యయం ప్రతిఏడాదికి 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.