ఒక్కచూపులో: 2015లో ఎల్ఐసీ ప్రారంభించిన బీమా పాలసీలు
ప్రమాదంలో ఒక వ్యక్తికి మరణిస్తే తన కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందీ రాకుండా చూసుకునేందుకు ఉపయోగపడేదే జీవిత బీమా పాలసీ. భారతీయలు చాలా మంది పూర్తిగా బీమా రక్షణ లేకుండా ఉంటారు.
కుటుంబానికి సరైన ఆర్ధిక సంరక్షణ కల్పించడంలో ఈ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా అనుకొని సంఘటన జరిగినప్పుడు తక్కువ బీమా పాలసీ కుటుంబాన్ని ఆర్ధికంగా పూర్తిగా ఆదుకోదు. ప్రస్తుత అవసరాలేమిటి?
భవిష్యత్తులో బాధ్యతలేమిటి? ఆస్తులు, అప్తులు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. జీవితంలో ఉండే అవసరాలు, దానికి తగ్గట్టుగా ఎలాంటి బీమా పాలసీ తీసుకుంటే మంచిదో చూద్దాం.
ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ (నెం. 834)
ఎల్ఐసీ జీవన్ తరుణ్ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే పథకం. చదువు, పెళ్ళి వంటి అవసరాలకు అనుగుణంగా ఒకేసారి లేదా ఐదేళ్ళకు కొంత మొత్తం వెనక్కి వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో 90 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 12 ఏళ్ళ లోపు వారు తీసుకోవచ్చు. పాలసీదారునికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మెచ్యూర్టీ మొత్తం ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా కాకుండా 20 ఏళ్ళ వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా కొంత మొత్తం చొప్పున వెనక్కి తీసుకోవచ్చు.
ఎల్ఐసీ జీవన్ లక్ష్య ప్లాన్ (నెం. 833)
ఎల్ఐసీ జీవన్ లక్ష్య ప్లాన్ అనేది ఎండోమెంట్ ప్లాన్. ఏదైనా అనుకొని సంఘటన జరిగి పాలసీదారుడు మరణిస్తే, కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. వీటితో పాటు సాధారణ రివర్షనరీ బోనస్లు, తుది అదనపు బోనస్ను వేరు వేరు గడువులలో ముట్టజెపుతారు.
ఎల్ఐసీ న్యూ చైల్డ్ మనీ బ్యాక్ ప్లాన్ (నెం 832)
12 ఏళ్ల లోపు పిల్లలకు చిల్డ్రన్స్ మనీబ్యాక్ పాలసీ వర్తిస్తుంది. పిల్లల విద్య తదితర అవసరాల కోసం ఉద్దేశించబడిన నాన్ లింక్డ్ మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీ కాలవ్యవధిలో పిల్లల జీవితానికి రిస్క్ను కవర్ చేస్తుంది. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత కాలానుగత చెల్లింపులూ చేయబడతాయి. ఒకవేళ పాలసీ సమయంలో తల్లిదండ్రులు మరణించినట్లయితే ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎల్ఐసీ జీవన్ సంగమ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ (నెం 831)
ఇది ఒక నాన్ లింక్డ్, సింగిల్ ప్రీమియం పథకం. ఈ సింగిల్ ప్రీమియం పథకం 6 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంది. పాలసీ చెల్లించిన ఐదు సంవత్సరాల్లో పాలసీదారుడు మరణించినట్లైతే కేవలం సింగిల్ ప్రీమియంను మాత్రమే చెల్లిస్తారు. అదే ఐదు సంవత్సరాల తర్వాత సదరు పాలసీదారుడు మరణించినట్లైతే చెల్లించిన ప్రీమియంకు పది రెట్లు జత చేసి లబ్ధిదారులకు చెల్లిస్తారు. ఉదాహరణకు సంవత్సరానికి సింగిల్ ప్రీమియం కింద రూ. 20,000 చెల్లిస్తుంటే, ఐదు సంవత్సరాల తర్వాత రూ. 2 లక్షలు పొందుతారు.