పెట్టుబడికి సరైన ప్రణాళిక ఎంచుకోవడం ఎలా?
సాధారణంగా పెట్టుబడులకు అధిక రాబడి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పెట్టుబడి వ్యయం మొత్తం ఎంత? ఎంత కాలానికి పెట్టుబడి పెడుతున్నారు అనేది కూడా చాలా కీలకం. దీంతో పాటు ఏయే పథకాలు ఎలాంటి వారికి సరిపోతాయో కూడా తెలుసుకోవాలి.
లేకుంటే లాభాల వెంటే నష్టం కూడా ఉంటుంది. ఉదహరణకు రాము తన దగ్గరున్న కొంత సొమ్మును మదపు చేయాలని అనుకున్నాడు. అతని ఆలోచన ప్రకారం తాను పెట్టిన పెట్టుబడికి 12 శాతం నుంచి 14 శాతం వరకూ రాబడి రావాలి. ఒకటి లేదా రెండేళ్లకు మించి పెట్టుబడి పెట్టడు.
రాబడి తక్కువగా ఉన్నా, పెట్టిన పెట్టుబడి పోకుండా ఉండేలా ఉండాలి. వాస్తవానికి ఇవన్నీ ఆలోచిస్తే సాధ్యం కావడం కష్టమే. నగదు పోతుందన్న భయం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తే, రాముకి మంచి రాబడి సాధించేందుకు అనువైన పెట్టుపడి మార్గాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి:
తక్కువ కాలంలో పెట్టిన పెట్టుబడికి కొంత ఫరవాలేదనిపించే రాబడిని అందించేవే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్లలో చాలా రకాలున్నాయి. ఒకదానితో మరోకదానికి సంబంధం ఉండదు. మ్యూచువల్ ఫండ్లలో తక్కువ నష్టభయంతో ఉన్న లార్జ్క్యాప్, ఇండెక్స్ ఫండ్లూ ఉన్నాయి.
ఇక అధిక నష్టభయం ఉండే సెక్టార్, కాంట్రా, ధీమాటిక్ ఫండ్లూ ఉన్నాయి. ధీమాటిక్ ఫండ్లు నిర్దేశించుకున్న పెట్టుబడి విధానానికే ప్రాధాన్యం ఇస్తాయి. కాంట్రా ఫండ్లు మార్కెట్ పరిస్ధితులను బట్టి మదపు చేయాలి. వీటిలో ఏది ఎంచుకోవాలన్నది వ్యక్తిగత ఆర్ధిక పరిస్ధితిని బట్టి ఆధాపడి ఉంటుంది.
ఎంత పెట్టుబడి: నెలనెలా సిప్ చేయడానికి రూ. 1,000 నుంచి
వ్యవధి: 5 ఏళ్లకు మించి మదుపు చేసేవారికి
సంవత్సర రాబడి: 13 శాతం నుంచి 15 శాతం
పన్ను: ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగిస్తే పన్ను ఉండదు. అదే ఏడాది లోపైతే వచ్చిన లాభంపై 15 శాతం
నష్టం: మార్కెట్ పరిస్ధితులు బాగా లేకపోతే కట్టిన మొత్తం కోల్పోవచ్చు.
కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు:
సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎలాంటి నష్టభయం ఉండదు. కానీ, రాబడి అంతంత మాత్రమే. కాస్త నష్టాన్ని భరించగలిగితే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి రాబడిని సాధించేందుకు మంచి మార్గం. కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్యాంకు డిపాజిట్లు లాంటివే. కాకపోతే ఈ డిపాజిట్లను కంపెనీలు స్వీకరిస్తాయి. నష్టభయం అధికంగా ఉండటంతోపాటు, వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
ఎంత పెట్టుబడి: రూ. 10,000 నుంచి రూ. 20,000
వ్వవధి: 1, 2, 3, 4, 5 ఏళ్లు
రాబడి: 11 శాతం నుంచి 13 శాతం
పన్ను: వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబ్ను బట్టి పన్ను చెల్లించాలి.
నష్టం: కంపెనీలు దివాలా తీస్తే మూల ధనం మొత్తం కోల్పోవాల్సి ఉంది.